Maharashtra Heavy Rainfalls: Landslide Kills 13 Maharashtra Raigad, CM Shinde Rushed To Site - Sakshi
Sakshi News home page

Raigad Landslide Incident: వర్ష బీభత్సం.. గ్రామంపై విరిగిపడ్డ కొండచరియలు.. 16 మంది మృతి

Published Thu, Jul 20 2023 4:14 PM

Landslide Kills 13 Maharashtra Raigad Many trapped CM Shinde At site - Sakshi

ముంబై: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖలాపూర్‌ తహశీల్‌లోని ఇర్షల్‌వాడి గ్రామంలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాలతో రాళ్లు, బురద మట్టి గ్రామాన్ని కప్పేశాయని గురువారం ఘటనాస్థలిని సందర్శించిన సీఎం ఏక్‌నాథ్‌ షిండే తెలిపారు. గ్రామంలో 48 గిరిజన కుటుంబాలకు చెందిన మొత్తం 103 మంది నివసిస్తుండగా కొందరు పాలం పనులకు, వారి పిల్లలు రెసిడెన్షియల్‌ స్కూళ్లకు వెళ్లారని తెలిసిందన్నారు.

సుమారు 20 అడుగుల మేర పేరుకుపోయిన రాళ్లు, బురదలో 17 ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇప్పటి వరకు 16 మృతదేహాలను వెలికితీశారని, మరో 21 మందిని సహాయక సిబ్బంది కాపాడారని చెప్పారు. రోడ్డు సౌకర్యం కూడా లేని ఆ కొండప్రాంతంలో భారీ వర్షం కొనసాగుతున్నందున సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని చెప్పారు.   2014లో పుణే జిల్లా మాలిన్‌ గ్రామంపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో 50 గిరిజన కుటుంబాలకు చెందిన 153 మంది ప్రాణాలు కోల్పోయారు.   

సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఫ్‌ బృందాలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద నుంచి 12  ఇప్పటి వరకు మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. మరో 75 మందిని సురక్షింతంగా బయటకు తీశామని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ వ్యక్తి సైతం గుండెపోటుతో మరణించినట్లు పేర్కొన్నారు. 

కాగా కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను సమీక్షించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అదే విధంగా క్షతగాత్రుల వైద్య ఖర్చులను మహారాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు. 

మరోవైపు శివసేన(ఉద్ధవ్‌ వర్గం) నేత ఆదిత్యా ఠాక్రే ప్రమాద స్థలానికి వెళ్లారు. అక్కడ వద్ద పరిస్థితి హృదయ విదారకంగా ఉందన్నారు. తాము గ్రామస్థులతో మాట్లాడటానికి ప్రయత్నించామని.. కానీ అక్కడికి చేరుకోవడం కష్టంగా ఉందన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. అయితే ఘటనా స్థలానికి వెళ్లేందుకు పట్టుబట్టి రాష్ట్ర యంత్రాంగంపై మరింత ఒత్తిడి తీసుకురావాలనుకోవట్లేదని అన్నారు. అలాగే ఈ సమస్యను రాజకీయం చేయకూడదని కూడా అన్నారు. బాధితుల ప్రాణాలు కాపాడటం ముఖ్యమని, ప్రస్తుతానికి రెస్క్యూ కార్యకలాపాలపై దృష్టి పెడుతున్నామని చెప్పారు. 

కొండచరియలు విరిగిపడిన మృతులకు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంతాపం తెలిపారు. ఈ సంఘటన గురించి సమాచారం అందినప్పటి నుంచి స్థానిక ధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయని.. మరో రెండు బృందాలు త్వరలో చేరుకుంటాయని చెప్పారు. భారీ వర్షాలు, చీకటి కారణంగా మొదట్లో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని, అయితే ఇప్పుడు వేగం పుంజుకుందని ఆయన అన్నారు.

Advertisement
Advertisement