అయోధ్యకు క్యూ కట్టిన భక్తులు.. ఇప్పటి వరకు దర్శనాలు, హుండీ.. | Large Member Of Devotees Queue In Ayodhya Ram Mandir, 11 Days Darshans And Donations Details - Sakshi
Sakshi News home page

Ayodhya Ram Mandir: అయోధ్యకు క్యూ కట్టిన భక్తులు.. ఇప్పటి వరకు దర్శనాలు, హుండీ..

Published Fri, Feb 2 2024 8:08 AM

Large Member Of Devotees Queue In Ayodhya Ram Mandir - Sakshi

అయోధ్య: యూపీలోని అయోధ్య మందిరానికి భక్తులు క్యూ కడుతున్నారు. బాలరాముడిని చూసేందుకు దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ఇక, కేవలం 11 రోజుల్లోనే ఏకంగా 25 లక్షల మంది భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో రూ.11 కోట్ల మేర హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

కాగా, అయోధ్యలోని బాలక్‌ రాముడి దర్శన మార్గంలో నాలుగు హుండీలను ఏర్పాటు చేశారు. ఇక, గత 11 రోజుల్లో 25లక్షల మంది భక్తులు బాలరాముడిని దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.8 కోట్లు నగదు రూపంలో, రూ.3.5 కోట్లు చెక్కుల రూపంలో వచ్చాయి. ఇందులో ఆన్‌లైన్​ విరాళాలు కూడా ఉన్నాయి. మొత్తం 14 మందితో కూడిన బృందం ఈ హుండీల్లోని విరాళాలను లెక్కించింది. ఇక, భక్తులు కానుకలు సమర్పించడం నుంచి వాటిని లెక్కింపు వరకూ అంతా సీసీటీవీ కెమెరాల నిఘా పర్యవేక్షణలోనే జరుగుతుందని ఆలయ ట్రస్టు ఆఫీస్‌ ఇన్‌ఛార్జి ప్రకాశ్‌ గుప్తా తెలిపారు.

ఇదిలా ఉండగా.. భారీసంఖ్యలో వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అయోధ్యలోని బాలరాముడి‌ మందిరంలో స్వామి దర్శన సమయాన్ని ఆలయ నిర్వాహకులు ఇటీవల పొడిగించారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు ఆలయాన్ని సందర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. అంతకుముందు ఆలయ దర్శన వేళలు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే ఉండేవి.

Advertisement
Advertisement