దేశంలో 44 రోజులు ఎన్నికలు: కారణం ఇదే.. | Sakshi
Sakshi News home page

దేశంలో 44 రోజులు ఎన్నికలు: కారణం ఇదే..

Published Mon, Mar 18 2024 6:56 PM

Lok Sabha Election 2024 Why India Multi Phase Election Takes So Long Check Here Details - Sakshi

భారత ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది. 2024 ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు దేశ వ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అంటే భారతదేశంలో 2024 ఎన్నికలు 44 రోజులు జరగనున్నట్లు స్పష్టమవుతోంది. దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి 44 రోజులు అవసరమా? ఇన్ని రోజులు ఎలక్షన్స్ నిర్వహించడానికి కారణం ఏంటనేది, ఈ కథనంలో చూసేద్దాం..

44 రోజులు ఎన్నికలు నిర్వహించడానికి ప్రధాన కారణాలు రెండు ఉన్నాయి. ''ఒకటి దేశంలో అత్యధిక జనాభా ఉండటం. మరొకటి ప్రతి ఓటరు తన ఓటును తప్పకుండా వినియోగించుకోవాలనే ఉద్దేశ్యం''.

బ్రిటీష్ పాలన నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత 1951 - 1952లో భారతదేశంలో మొదటి ఎన్నికలు నిర్వహించడానికి దాదాపు నాలుగు నెలల సమయం పట్టింది. అయితే 1980లో కేవలం నాలుగు రోజుల్లోనే ఎన్నికలు పూర్తయిపోయాయి. 2019లో ఎన్నికలు 39 రోజులు జరిగాయి. కాగా ఈ ఏడాది ఈ సంఖ్య కాస్త ముందుకు సాగింది. దీంతో 44 రోజులు ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

పార్లమెంటు దిగువ సభకు 543 మంది శాసనసభ్యులను ఎన్నుకునే ఓటింగ్ ఏడు దశల్లో జరుగుతుంది. భారతదేశంలోని 28 రాష్ట్రాలు, ఎనిమిది ఫెడరల్ భూభాగాల్లో వేర్వేరు సమయాల్లో ఓటింగ్ నిర్వహిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో తక్కువ రోజుల్లో ఓటింగ్ పూర్తవొచ్చు, మరి కొన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ కోసం ఎక్కువ సమయం పట్టవచ్చు. ఇది ఆ రాష్ట్రంలో ఉన్న జనాభా మీద ఆధారపడి ఉంటుంది. 

ఎన్నికల్లో ప్రతి ఓటు ముఖ్యమైనదే..
ఎన్నికల్లో ప్రతి ఓటు ముఖ్యమైనదే. కాబట్టి భారత ఎన్నికల సంఘం ప్రతి ఓటరుకు 2 కిలోమీటర్ల దూరంలో ఓటింగ్ బూట్ అందుబాటులో ఉండేలా చూసుకుంటుంది. అందరూ ఓటు హక్కుని వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది.

2019లో భారతదేశం ఎన్నికలు నిర్వహించినప్పుడు, పోలింగ్ అధికారుల బృందం నాలుగు రోజుల పాటు ట్రెక్కింగ్ చేసింది. అప్పుడు చైనా సరిహద్దులో ఉన్న మారుమూల రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని ఒక కుగ్రామంలో ఒక్క ఓటరు తమ హక్కును వినియోగించుకోగలిగారు.

2019లోనే హిమాలయాలలో ఎత్తైన గ్రామానికి వెళ్లి 15,256 అడుగుల (4,650 మీటర్లు) ఎత్తులో బూత్‌ను ఏర్పాటు చేశారు, ఇది ప్రపంచంలో ఎక్కడైనా ఎత్తైన పోలింగ్ స్టేషన్. ఈసారి కూడా.. దక్షిణ కేరళ రాష్ట్రంలోని వన్యప్రాణుల అభయారణ్యం లోపల ఒకటి, పశ్చిమ గుజరాత్ రాష్ట్రంలోని షిప్పింగ్ కంటైనర్‌తో సహా మారుమూల ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

కట్టుదిట్టమైన భద్రత
భారతదేశంలో ఏడు దశల్లో ఎన్నికలు జరగటం వల్ల భద్రత చాలా కీలకమైనది. హింసను నిరోధించడానికి, ఎన్నికల అధికారులను, ఓటింగ్ యంత్రాలను రవాణా చేయడానికి సాధారణంగా సరిహద్దులను కాపాడే పదివేల మంది కేంద్ర భద్రతా బలగాలు, ఆయా రాష్ట్ర పోలీసులతో పాటు భద్రత కల్పించనున్నారు.

Advertisement
Advertisement