అమాయకుల ఇళ్లపైకే బుల్డోజర్లు | Sakshi
Sakshi News home page

అమాయకుల ఇళ్లపైకే బుల్డోజర్లు

Published Sun, Feb 25 2024 5:25 AM

Lok Sabha elections 2024: Bulldozers demolish homes of innocent while guilty escape - Sakshi

లక్నో:  ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా నిప్పులు చెరిగారు. బుల్డోజర్లతో అమాయక ప్రజల ఇళ్లను కూలి్చవేస్తున్నారని, ప్రభుత్వ నిర్వాకం వల్ల నేరగాళ్లు మాత్రం నిక్షేపంగా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఆమె శనివారం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో తన సోదరుడు రాహుల్‌ గాంధీతోపాటు భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం రైతులు రోజుల తరబడి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. రైతుల మొర ఆలకించే తీరిక పాలకులకు లేదా? అని నిలదీశారు.

ఉత్తరప్రదేశ్‌లో రైతులపైకి జీపులు నడిపించి చంపిన నాయకుల ఇళ్లపైకి, మహిళలను వేధించిన దుర్మార్గుల ఇళ్లపైకి, ప్రశ్నాపత్రాలను లీక్‌ చేసినవారి ఇళ్లపైకి బుల్డోజర్లు వెళ్లడం లేదని ధ్వజత్తారు. అమాయకుల ఇళ్లు మాత్రమే బల్డోజర్ల కింద నలిగిపోతున్నాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులు, రైతులకు అన్యాయం జరుగుతుండడం వల్లే యాత్రలో ‘న్యాయ్‌’ పదాన్ని చేర్చామన్నారు. ఆదివారం ఆగ్రాలో యాత్రలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ పాల్గొంటారని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

ఆ పిల్లలు రీల్స్‌ చూడరు: రాహుల్‌
దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఇక యువత రోజుకు 12 గంటలు మొబైల్‌ ఫోన్లు చూడక ఏం చేస్తారని రాహుల్‌ ప్రశ్నించారు. ఆయన శనివారం యూపీలోని సంభాల్‌లో భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో మాట్లాడారు. రోజుకు ఎన్ని గంటలు ఫోన్‌ వాడుతున్నారని యువతను ప్రశ్నించగా 12 గంటలని బదులిచ్చారు. దాంతో రాహుల్‌ ఈ మేరకు స్పందించారు. సంపన్నులు, బడా వ్యాపారవేత్తల పిల్లలు ఫోన్లలో రీల్స్‌ చూడరని, రోజంతా డబ్బులు లెక్కపెట్టుకొనే పనిలోనే ఉంటారని అన్నారు.
శనివారం యూపీలోని మొరాదాబాద్‌లో భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో రాహుల్, ప్రియాంక

Advertisement
Advertisement