Lok Sabha Elections 2024: 20 ఏళ్ల తర్వాత ఓటు | Sakshi
Sakshi News home page

Lok Sabha Elections 2024: 20 ఏళ్ల తర్వాత ఓటు

Published Tue, Apr 9 2024 6:14 AM

Lok Sabha Elections 2024: Maoist-hit areas of Jharkhand Singhbhum to vote for first-time - Sakshi

న్యూఢిల్లీ: మావోయిస్టు ప్రభావిత జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు రెండు దశాబ్దాల అనంతరం మొదటిసారిగా 2024 ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటర్ల సౌలభ్యం కోసం మావోయిస్టులకు కంచుకోటల్లాంటి మారుమూల ప్రాంతాల్లో 118 బూత్‌లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కుల్దీప్‌ చౌదరి చెప్పారు. ఆసియాలోనే అత్యంత దట్టమైన సాల్‌ అడవుల్లో ఉన్న సరండా వంటి 118 గ్రామాల్లోకి మే 13వ తేదీన జరిగే పోలింగ్‌కు సిబ్బందితోపాటు సామగ్రిని హెలికాప్టర్ల ద్వారా పంపుతామన్నారు. నుగ్డి గ్రామంలోని మిడిల్‌ స్కూల్, బొరెరో గ్రామంలోని మధ్య విద్యాలయలో మొదటిసారిగా పోలింగ్‌ బూత్‌లను నెలకొల్పామన్నారు.

కొన్ని ప్రాంతాల్లోకి సిబ్బంది నాలుగైదు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి ఉంటుందని వివరించారు. ఏ ప్రాంతాన్నీ వదలకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ‘ఆపరేషన్‌ అనకొండ’ ద్వారా భద్రతా బలగాలు తల్కోబాద్‌ వంటి 25 వరకు గ్రామాల్లో 15 కొత్త క్యాంపులను ఏర్పాటు చేసి, భద్రతను కట్టుదిట్టం చేశాయని పేర్కొన్నారు. 121 పోలింగ్‌ బృందాలను రైళ్ల ద్వారా పంపించామన్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వారికి ఇళ్ల వద్దే ఓటు వేసే సదుపాయం కలి్పంచినట్లు చెప్పారు. ఎస్టీ్ట రిజర్వుడు స్థానమైన సింగ్‌భూమ్‌లో బీజేపీ నుంచి మాజీ సీఎం మధు కోడా భార్య, సిట్టింగ్‌ ఎంపీ గీతా కోడా రంగంలో ఉన్నారు. ఇండియా కూటమి అభ్యరి్థని ప్రకటించాల్సి ఉంది.

Advertisement
Advertisement