సాక్షి, న్యూఢిల్లీ: గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఉత్తర్ప్రదేశ్లోని అమేధీ నియోజకవర్గం నుంచి అగ్రనేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా రాజకీయ అరంగేట్రం చేసే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
దీనికి తగ్గట్టుగా అమేధీ ప్రజలు తనను కోరుకుంటే ఎంపీగా ప్రాతినిధ్యం వహించేందుకు సిధ్దమని ఆయన ఇటీవల చేసిన ప్రకటన ఈ తరహా ప్రచారానికి బలాన్నిస్తోంది. దీనికి తోడు ప్రస్తుతం అమేధీ ఎంపీగా ఉన్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి, ‘ఆమె వల్ల అమేధీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆమెను ఎన్నుకోవడం ద్వారా తప్పుచేశామని నమ్ముతున్నారు’ అంటూ విమర్శలు సంధించడంతో వాద్రా పోటీ ఖాయమని ఏఐసీసీ వర్గాలంటున్నాయి.