16వ బిడ్డకు జన్మనిస్తూ మహిళ మృతి | Sakshi
Sakshi News home page

నవజాత శిశువు కూడా మృతి 

Published Mon, Oct 12 2020 9:25 AM

Madhya Pradesh Woman Dies After Giving Birth to 16th Child - Sakshi

భోపాల్‌: 16వ బిడ్డకు జన్మనిస్తూ.. ఓ మహిళ చనిపోయింది. విషాదం ఏంటంటే తల్లి మరణించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే నవజాత శిశువు కూడా మరణించింది. వివరాలు.. మధ్యప్రదేశ్‌ దామోహ్‌ జిల్లాకు చెందిన సుఖ్రాని అహిర్వర్‌ 16వ సారి గర్భం దాల్చింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఆమెకు నొప్పులు వచ్చాయి. దాంతో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ కింద గుర్తింపు పొందిన ఆశా కార్యకర్త కల్లో బాయి విశ్వకర్మ సుఖ్రానికి డెలివరీ చేసింది. మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి నిమిషాల వ్యవధిలోనే కన్ను మూసింది. మరి కాసేపటికే నవజాత శిశువు కూడా మృతి చెందింది. (చదవండి: చెన్నూర్‌లో వింత శిశువు జ‌న‌నం)

ఈ సందర్భంగా విశ్వకర్మ మాట్లాడుతూ.. ‘డెలివరీ తర్వాత సుఖ్రాని, ఆమె నవజాత శిశువు పరిస్థితి విషమంగా మారటంతో వారిద్దరిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాము. అక్కడ చేరిన వెంటనే తల్లి.. కాసేపటికే బిడ్డ చనిపోయినట్లు తెలిసింది. సుఖ్రాని గతంలో 15 మంది పిల్లలకు జన్మనిచ్చింది. కానీ వారిలో ఏడుగురు చనిపోయారు’ అని తెలిపింది. దీని గురించి జిల్లా చీఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సంగీత త్రివేది పీటీఐకి తెలపడంతో వెలుగులోకి వచ్చింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement