ఉదయం పెళ్లి.. రాత్రి జైలుకు  | Sakshi
Sakshi News home page

ఉదయం పెళ్లి.. రాత్రి జైలుకు 

Published Tue, Aug 25 2020 6:26 AM

Madras High Court Ordered To Investigate Prisoner Marriages - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: పెళ్లంటే నూరేళ్ల పంట. స్త్రీ, పురుషులు ఒకరి కోసం ఒకరుగా కలిసిమెలసి పండించుకోవాల్సిన నిండైన జీవితం. కొందరు యువతుల జీవితాల్లో చిత్రమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. భార్యల కాళ్లపారాణి ఆరకముందే వారి భర్తలు కటకటాల వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇదేం చోద్యమని సాక్షాత్తు న్యాయమూర్తులే ఆశ్చర్యం వ్యక్తంచేశారు. విచారణ జరపాలని జాతీయ మహి ళా కమిషన్‌ను ఆదేశించారు. యావజ్జీవ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న తన భర్త కు పెరోల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఒక యువతి మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు ఎన్‌ కృపాకరన్, వీఎం వేలుమణి విచారించారు. పెళ్లి చేసుకునేటప్పు తన భర్త ఒక యావజ్జీవ ఖైదీ అనే విషయం తెలియదని ఆమె చెప్పింది. ఒక హత్య కేసులో కింది కోర్టు భర్తకు యావజ్జీవ శిక్ష విధించడాన్ని హైకోర్టులో సవాలు చేసి జామీనుపై బయటకు వచ్చిన సమయంలో తనను పెళ్లిచేసుకున్నాడని పేర్కొంది. దీంతో న్యాయమూర్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఇలాంటి కేసులు మరికొన్ని దాఖలయ్యాయి. గతంలో అస్లాం అనే ఖైదీకి 30 రోజుల పెరోల్‌ మంజూరు చేసేలా జైళ్ల శాఖను ఆదేశించాలని కోరుతూ అతడి భార్య అడ్‌కొనర్వ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ మహిళ తన భర్త ఒక యావజ్జీవ ఖైదీ అని తెలిసే పెళ్లి చేసుకుంది. 20 ఏళ్లుగా జైల్లో ఉంటున్న భర్తను పెరోల్‌పై విడుదల చేయాల్సిందిగా కోరింది. పదేళ్లకు ముందు ఒక్కరోజు పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చినపుడు పెళ్లి చేసుకున్నాడని, అదే రోజు రాత్రి జైలుకు వెళ్లిపోవడంతో అత్తగారితోపాటూ ఉంటు న్నట్లు తెలిపింది. దీనిపై న్యాయమూర్తులు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో పెళ్లి చేసుకునే వారు అనేక వివరాలను సేకరిస్తున్నారని, ఒక ఖైదీని, అందునా యావజ్జీవ ఖైదీని వివాహమాడేందుకు ఏ యువతీ అంగీకరించదన్నారు. యువతుల అభీష్టం మేరకు పెళ్లిళ్లు జరుగుతున్నాయా? లేక బలవంతంగా చేస్తున్నారా అన్న దానిపై విచారణ చేసి బదులు పిటిషన్‌ వేయాలని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్, మహిళా శిశు సంక్షేమం, అభివృద్ధి శాఖలను ఆదేశిస్తున్నట్టు ప్రకటించారు. కేసు విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు.   

Advertisement
Advertisement