తదుపరి ప్రధానిగా కూడా మోదీనే! | Sakshi
Sakshi News home page

మరోసారి ప్రధాని మోదీకి పట్టంకట్టిన ప్రజలు!

Published Sat, Aug 8 2020 9:00 AM

Narendra Modi Number One Choice As Next PM In Latest Survey - Sakshi

న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్ర మోదీకి తిరుగులేదని, ప్రజల్లో ఆయనకున్న విశ్వాసం ఏమాత్రం తగ్గలేదని తాజా సర్వే వెల్లడించింది. అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయనే తదుపరి ప్రధాన మంత్రిగా ఉండాలని 66 శాతం ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇక ఈ విషయంలో కేవలం 8 శాతం మంది మాత్రమే కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ వైపు మొగ్గు చూపినట్లు పేర్కొంది. అదే విధంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి 5 శాతం ఓట్లు పడినట్లు తెలిపింది. (అత్యుత్తమ సీఎంలలో వైఎస్‌ జగన్‌కు మూడో స్థానం)

ఇక కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(4%), యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్‌(3 శాతం), కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ(1 శాతం), పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(2 శాతం), కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ(2 శాతం), రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(1 శాతం), మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే(1 శాతం), బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ తదితరులు కూడా ‘నెక్ట్స్ పీఎం’ ప్రాధాన్య జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే- కార్వీ ఇన్‌సైట్స్‌ ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పేరిట చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కాగా కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో జులై 15, 2020 నుంచి జూలై 27, 2020 మధ్య 12,021 మందితో టెలిఫోన్‌ ఇంటర్వ్యూ ద్వారా వివిధ అంశాల్లో అభిప్రాయాలు సేకరించారు. 

Advertisement
Advertisement