విపక్షాల ఐక్యతే ముఖ్యం | Sakshi
Sakshi News home page

విపక్షాల ఐక్యతే ముఖ్యం

Published Fri, May 12 2023 6:36 AM

Nitish Kumar, Tejashwi Yadav meet Uddhav Thackeray in Mumbai - Sakshi

ముంబై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలను ఐక్యం చేసే ప్రయత్నాలను బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తీవ్రతరం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, ఆర్‌జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌తో కలిసి శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌లను గురువారం వేర్వేరుగా  కలుసుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడానికి తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు.

ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ దేశ ప్రయోజనాల కోసం ఏమీ చేయడం లేదని ఆరోపించారు. అందుకే పార్టీ ప్రయోజనాలతో పాటుగా దేశ ప్రయోజనాలను కూడా కాపాడడానికి కృషి చెయ్యాలని ఇరువురు నేతలకు చెప్పినట్టుగా వెల్లడించారు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలు ముందు దేశ ప్రయోజనాలను కాపాడాలన్న ఏకైక లక్ష్యం ఉందని నితీశ్‌ అన్నారు. అందరూ కలసికట్టుగా పోరాడితే బీజేపీపై విజయం సాధించవచ్చునని చెప్పారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం త్వరలోనే బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటితో సమావేశం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. 

Advertisement
Advertisement