Sakshi News home page

తెలంగాణలో కొత్తగా 3 ఎయిర్‌పోర్టులే సాధ్యం: వీకే సింగ్‌ 

Published Fri, Feb 3 2023 8:15 AM

Only 3 New Airports Are Possible In Telangana VK Singh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో మూడు ప్రాంతాలను మాత్రమే కొత్తగా విమానాశ్రయాల నిర్మాణానికి సాంకేతికంగా అనువైన ప్రదేశాలుగా గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆరు విమానాశ్రయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలపై ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) చేసిన అధ్యయనం ప్రకారం ఈమేరకు కేంద్రం వెల్లడించింది.

వరంగల్‌ (బ్రౌన్‌ఫీల్డ్‌), ఆదిలాబాద్‌ (బ్రౌన్‌ఫీల్డ్‌), జక్రాన్‌పల్లి (గ్రీన్‌ఫీల్డ్‌) ప్రాంతాలు మాత్రమే సాంకేతికంగా సాధ్యమయ్యేవని ఏఏఐ నివేదికలో పేర్కొంది. అయితే తక్షణ భూసేకరణ అవసరాన్ని నివారించడానికి చిన్న విమానాల ప్రైవేట్‌ కార్యకలాపాల కోసం ఈ మూడు ప్రాంతాల్లో సాధ్యమయ్యే స్థలాలను అభివృద్ధి చేసి, ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏఏఐ కోరిందని పౌర విమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఎంపీలు మాలోత్‌ కవిత, వెంకటేశ్‌ నేత, రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. 

హైదరాబాద్‌లో ఏవియేషన్‌ వర్సిటీకి నో 
హైదరాబాద్‌లో రాజీవ్‌గాంధీ జాతీయ ఏవియేషన్‌ వర్సిటీ క్యాంపస్‌ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన తెలంగాణ ప్రభుత్వం నుంచి 2018లో వచ్చిందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనను ఆర్‌జీఎన్‌ఏయూ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఆమోదించలేదని వెల్లడించారు. ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి ఈమేరకు బదులిచ్చారు.

Advertisement
Advertisement