చిత్రకారునికి కొత్త చేతులు.. ఢిల్లీ వైద్యుల అద్భుతం! | Sakshi
Sakshi News home page

Delhi: చిత్రకారునికి కొత్త చేతులు.. ఢిల్లీ వైద్యుల అద్భుతం!

Published Thu, Mar 7 2024 7:51 AM

Painter Gets his Hands Back After First Bilateral Transplant Surgery - Sakshi

ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయిన ఒక చిత్రకారుడు ఇప్పుడు తన కొత్త చేతులతో బ్రష్‌ పట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఢిల్లీకి చెందిన వైద్యుల బృందం చేసిన ఈ సర్జికల్ ఎక్సలెన్స్ ను అందరూ కొనియాడుతున్నారు. 

అవయవ దానంతో తన శరీరం నలుగురికి ఉపయోగపడాలని తపనపడిన ఒక మహిళ కలను ఆ వైద్యుల బృందం సాకారం చేసింది. ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ వైద్యులు 45 ఏళ్ల వ్యక్తికి ద్వైపాక్షిక చేతి మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించారు.. బాధితుడు 2020లో రైలు ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయాడు. దీంతో అతను ఏ పనీ చేయలేక నిరాశగా కాలం వెళ్లదీస్తున్నాడు. అయితే బ్రెయిడ్‌ డెడ్‌కు గురైన ఒక మహిళ అతనికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది.

బ్రెయిన్ డెడ్‌కు చేరిన దక్షిణ ఢిల్లీలోని ఒక పాఠశాల మాజీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ మీనా మెహతా తన మరణానంతరం అవయవ దానానికి గతంలోనే సమ్మతి తెలిపారు. దీంతో ఆమె శరీరంలోని కిడ్నీ, కాలేయం, కార్నియా ముగ్గురికి కొత్త జీవితాన్ని ప్రసాదించాయి. ప్రమాదంలో చేతులు పోగొట్టుకుని నిస్సహాయంగా బతుకీడుస్తున్న ఒక చిత్రకారుని కుంచె ఇప్పుడు తరిగి అద్భుతాలను చేసేందుకు సిద్ధం అయ్యింది. 

ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన వైద్యుల బృందానికి విశేష ప్రశంసలు అందుతున్నాయి. ఈ శస్త్రచికిత్స చేయడానికి వైద్యులకు 12 గంటలకుపైగా సమయం పట్టింది. ఎట్టకేలకు వైద్యుల కృషి ఫలించింది.  ఆ వైద్యుల బృందం చిత్రకారునితో ఒక ఫోటోను క్లిక్ చేసింది. పెయింటర్‌ విజయోత్సాహంతో తన రెండు చేతులను పైకి ఎత్తడాన్ని ఆ ఫొటోలో మనం చూడవచ్చు. 

Advertisement
Advertisement