Sakshi News home page

దేశంలోనే అతిపొడవైన సముద్రపు వంతెనను ప్రారంభించిన మోదీ.. విశేషాలివే..

Published Fri, Jan 12 2024 4:39 PM

PM Modi inaugurates Indias longest bridge Atal Setu in Mumbai - Sakshi

సాక్షి, ముంబై: ముంబైలోని నిర్మించిన దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘అటల్‌ సేతు’ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభించారు. దీనినే ముంబై ట్రాన్స్‌హార్బర్‌ లింక్‌ అని కూడా పిలుస్తున్నారు. ముంబైలో దాదాపు రూ. 20 వేల కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా నిర్మించిన ఈ బ్రిడ్జిని ప్రధాని .. జాతికి అంకితం చేశారు.

కాగా అటల్‌ సేతు మొత్తం పొడువు 22 కిలోమీటర్లు. 16.5 కిలోమీటర్ల మేర అరేబియా సముంద్రంపై.. 5.5 కిలో మీటర్ల భూభాగంపై నిర్మించారు. భూకంపాలను సైతం తట్టుకొనేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికతతో నిర్మించారు.

ఇది ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై-గోవా హైవేలను కలుపుతుంది. ఈ బ్రిడ్జిపై టోల్‌ ఫీజు ఒకవైపు రూ. 250 వసూలు చేయనున్నారు. ఫ్లెమింగో పక్షుల కోసం బ్రిడ్జ్‌కు ఒకవైపు సౌండ్‌ బారియర్‌ ఏర్పాటు చేశారు. అటల్‌ సేతు వంతెన ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే ముంబై నుంచి నవీ ముంబైకు చేరుకోవచ్చు. గతంలో ముంబై నుంచి నవీ ముంబైకి రెండు గంటల సమయం పట్టేది.

అటల్‌ సేతు వంతెనకు 2016 డిసెంబర్‌లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది జూన్‌ నాటికి పూర్తి కావాల్సిన వంతెన.. గడువుకు ఆరు నెలల ముందే( డిసెంబర్‌ 25 నాటికి) సిద్ధం చేసినట్లు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్‌ సంజయ్‌ ముఖర్జీ తెలిపారు. కాంట్రాక్టర్లు, అధికారులు, కార్మికులు మూడు షిఫ్టుల్లో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.  

Advertisement
Advertisement