సాక్షి, చెన్నై: లోక్సభ ఎన్నికల వేళ తమిళనాడులో ప్రజలకు ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. శ్రీలంకలో అరెస్ట్ అయిన మత్స్యకారులను క్షేమంగా భారత్కు తీసుకువస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో తమిళ సంస్కృతికి డీఎంకే వ్యతిరేకి అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
కాగా, ప్రధాని మోదీ తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేలూరులో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. ఈరోజు దేశం మొత్తం కాంగ్రెస్, డీఎంకే పార్టీల మరో కపట నాటకం గురించి చర్చిస్తోంది. కాంగ్రెస్ హయాంలోనే కచ్చాతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించారు. ఎవరి ప్రయోజనం కోసం కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఏ కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
#WATCH | Tamil Nadu: Addressing a public rally in Vellore, PM Narendra Modi says, "Today the whole country is discussing another hypocrisy of Congress and the DMK party. When Congress was in government, these people gave Kachchatheevu Island to Sri Lanka. In which cabinet was… pic.twitter.com/Gr004Zxmea
కచ్చాతీవు ద్వీపం వద్దకు వెళ్లిన వేలాది మంది తమిళనాడు మృత్స్యకారులను శ్రీలంక కోస్టల్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి అరెస్ట్పై కాంగ్రెస్ ఎందుకు మౌనం వహించింది. కానీ, బీజేపీ ప్రభుత్వం మాత్రం అరెస్ట్ అయిన మత్స్యకారులను క్షేమంగా వెనక్కి తీసుకువస్తుంది. అదొక్కటే కాదు మరణ శిక్షలు విధింపబడిన వారిని కూడా సజీవంగా వెనక్కి తీసుకువస్తున్నాం. వారిని వారి వారి కుటుంబాలకు అప్పగించే బాధ్యత బీజేపీది అని వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమిళ సంస్కృతికి డీఎంకే వ్యతిరేకి. డీఎంకేది విభజన రాజకీయం. తమిళులను చీకట్లో ఉంచేసింది. అవినీతి చేయడానికి డీఎంకే కాపీరైట్ తీసుకుంది. కుటుంబం మొత్తం తమిళనాడును దోచుకుంటోంది. తమిళనాడులో బీజేపీ చరిత్ర సృష్టించబోతోంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీ గెలవబోతోంది అంటూ కామెంట్స్ చేశారు.