మాటలకందని బాధను అనుభవిస్తున్నాను: మోదీ | Sakshi
Sakshi News home page

మాటలకందని బాధను అనుభవిస్తున్నాను: మోదీ

Published Mon, Nov 15 2021 10:40 AM

PM Narendra Modi Condolences Babasaheb Purandare Death - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ చరిత్రకారుడు, రచయిత, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత బాబాసాహెబ్ పురందరే(99) సోమవారం ఉదయం మరణించారు. పురందరే మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. పురందరే మరణం తనకు మాటలకు అందని బాధను కలిగించిందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు మోదీ తన అధికారిక ట్విటర్‌లో ‘‘మాటలకందని బాధను అనుభవిస్తున్నాను. శివషాహీర్ బాబాసాహెబ్ పురందరే మరణం చరిత్ర,సాంస్కృతిక ప్రపంచంలో అతి పెద్ద శూన్యతను మిగిల్చింది. రానున్న తరాలు ఛత్రపతి శివాజీ మహారాజ్‌తో మరింత కనెక్ట్ అయ్యేలా చేసేందుకు గాను పురందరే చేసిన కృషికి కృతజ్ఞతలు. ఆయన ఇతర రచనలు కూడా గుర్తుండిపోతాయి’’ అని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. 
(చదవండి: పద్మ విభూషణ్‌ వెనక్కి ఇస్తున్న: మాజీ సీఎం)

అంతేకాక ‘‘పురందరే చాలా చమత్కారంగా మాట్లాడే వ్యక్తి మాత్రమే కాక భారతదేశ చరిత్ర గురించి ఆయనకు అపార జ్ఞానం ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగిన ఘనత నాకు లభించింది. కొన్ని నెలల క్రితం, ఆయన శతాబ్ది సంవత్సరపు కార్యక్రమంలో ప్రసంగించాను’’ అని మోదీ మరో ట్వీట్‌లో తెలిపారు. 
(చదవండి: 4 గంటల పర్యటన.. రూ.23 కోట్లకు పైగా ఖర్చు)

బాబాసాహెబ్‌గా ప్రసిద్ధి చెందిన బల్వంత్ మోరేశ్వర్ పురందరే సోమవారం ఉదయం 5 గంటలకు పూణే (మహారాష్ట్ర)లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చేరారు.

బాబాసాహెబ్‌ పురందరేను కేంద్ర ప్రభుత్వం 2019లో భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌తో.. 2015లో రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర భూషణ్ అవార్డుతో సత్కరించింది. పురందరే ఛత్రపతి శివాజీ మహారాజ్‌పై వివిధ పుస్తకాలను కూడా రాశారు. చరిత్ర పరిశోధనలకు తన జీవితాన్ని అంకితం చేశారు.
(చదవండి: నిజమా! అంతా బాగుందా?)

బాబాసాహెబ్ "జాంత రాజా" అనే నాటకాన్ని కూడా వ్రాసి దర్శకత్వం వహించారు, దీనిని 200 మంది కళాకారులు ప్రదర్శించారు. ఐదు భాషలలో అనువదించారు. మరోవైపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా పురందరే మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో బాసాహెబ్ పురందరేకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

చదవండి: దీటైన హామీ! కానీ విధానమే ప్రశ్నార్థకం!

Advertisement
Advertisement