Police Arrested Mother, Father & Brother, In Suspected Honour Killing Of Girl - Sakshi
Sakshi News home page

తల్లి చేతులు అణిచింది.. అన్న కాళ్లు నొక్కి పెట్టాడు.. తండ్రి చేతుల్లో పాశవిక పరువు హత్య!

Published Sat, Aug 19 2023 7:40 AM

Police Arrested Mother Father and Brother who did Horror Killing of Girl - Sakshi

ఆమె భర్త ఆ సమయంలో సోదరి ఇంటికి వెళ్లాడు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇంతలో ఆమె సోదరుడు, తల్లి, తండ్రి ఆమె ఇంటికి వచ్చారు. తల్లి ఆమె చేతులను గట్టిగా అదిమిపట్టుకుంది. సోదరుడు ఆమె కాళ్లను నొక్కిపెట్టాడు. తండ్రి ఆమె గొంతు నొక్కాడు.  తరువాత ఆమె మృతదేహాన్ని కారులో ఉంచి, తమ గ్రామానికి తీసుకువెళ్లి, అక్కడున్న ఒక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి, అక్కడ కుమార్తె మృతదేహాన్ని దహనం చేశారు. అయితే ఆమె భర్తకు ఈ విషయం తెలియదు. గ్రామంలోని అతని స్నేహితులు అతనికి ఫోన్‌ చేసి, నీ భార్య చనిపోయిందని, దహన సంస్కారాలు కూడా పూర్తయ్యాయని తెలిపారు. దీంతో అతను తన అత్తామామలపై అనుమానంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పరువు హత్యకు పాల్పడిన మృతురాలి తల్లిదండ్రులతో పాటు సోదరుడిని అరెస్టు చేశారు. కాగా నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు.
 
పండుగ పూట దారుణం
ఈ ఘటన ఆగస్టు 17న ఉదయం 11 గంటలకు జరిగింది. అంజలి(22) అనే మహిళ హరియాణాలోని గురుగ్రామ్‌లోని సెక్టార్‌ 102లో గల రాఫ్‌ ఆల్యాస్‌లోని ఫ్లాట్‌ నంబరు 201లో భర్త సందీప్‌తో పాటు ఉంటోంది. అంజలి బీఎస్‌సీ పూర్తి చేసింది.  ఆమె భర్త అతని సోదరి ఇంటికి తీజ్‌ ఉత్సవం సందర్భంగా మిఠాయిలు ఇ‍చ్చేందుకు వెళ్లాడు. ఇంతలో అంజలి ఇంటికి ఆమె తండ్రి కుల్దీప్‌, తల్లి రింకీ, సోదరుడు కుణాల్‌ వచ్చారు. వారు ఒక్కసారిగా అంజలిపై దాడి చేశారు. తండ్రి ఆమె గొంతునొక్కి హత్య చేశాడు. తరువాత వారు అంజలి మృతదేహాన్ని తమ కారులో ఉంచి, తమ గ్రామమైన సురౌతికి చేరుకున్నారు. తరువాత ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో అంజలి మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తొలుత గ్రామస్తులకు ఈ విషయం తెలియలేదు. తరువాత అసలు విషయం వెలుగు చూసింది. 

కుమార్తె బ్రాహ్మణ యువకుడిని వివాహం చేసుకున్నదని..
గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అంజలి భర్తకు ఫోన్‌ చేసి విషయం తెలిపాడు. వెంటనే సందీప్‌ తన భార్య అంజలిని ఆమె తల్లిదండ్రులు, సోదరుడు హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ ​​కేసు గురించి పోలీసు ఉన్నతాధికారి వరుణ్‌ దహియా మాట్లాడుతూ ఇది పరువు హత్య అని తెలిపారు. అంజలి జాట్‌ కుటుంబానికి చెందినది, సందీప్‌ బ్రాహ్మణుడని, ఇద్దరూ ప్రేమించుకుని, 2022 డిసెంబరు 19న ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారని తెలిపారు. అయితే వారు తమకు పెద్దల నుంచి ముప్పు ఉందని గ్రహించి, అప్పటి నుంచి గురుగ్రామ్‌లో ఉండసాగారు.

పథకం ప్రకారం పరువు హత్య
అంజలి ప్రేమ వివాహం చేసుకోవడం ఆమె ఇంటిలోని వారికి ఏమాత్రం నచ్చలేదు. అందుకే వారు ఒక పథకం ప్రకారం అంజలిని హత్య చేశారని పోలీసు అధికారి వరుణ్‌ తెలిపారు. కాగా అంజలి సోదరుడు కుణాల్‌ కూడా ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతను తన సోదరిని హత్య చేసేందుకు ఒక పథకం ప్రకారం ఆమె భర్త సందీప్‌తో పరిచయం పెంచుకుని వారుంటున్న అపార్ట్‌మెంట్‌లోని మరో ఫ్లాట్‌లో కాపురం పెట్టాడు.

ఆగస్టు 17న సందీప్‌ తీజ్‌ ఉత్సవం సందర్భంగా అతని సోదరి ఇంటికి వెళ్లాడు. ఈ విషయాన్ని కుణాల్‌ తన తల్లిదండ్రుకు తెలిపాడు. వెంటనే వారు అంజలి ఇంటికి చేరుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అంజలి తండ్రి ఒక ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో పనిచేస్తుంటాడని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి వరుణ్‌ దహియా తెలిపారు.  
ఇది కూడా చదవండి: నాడు కుక్క మాంసంపై నిషేధం.. నేడు ఎత్తివేత.. మధ్యలో ఏం జరిగింది?

Advertisement
Advertisement