మీడియా తప్పుడు కథనాలు.. ఎఫ్ఐఆర్‌ నమోదు చేసిన ప్రభుత్వం | Police Case Against 4 Over Editors Guild's Crowdfunded Manipur Report - Sakshi
Sakshi News home page

తప్పుడు కథనాలు ప్రచురించిన మీడియా సంస్థపై ఎఫ్ఐఆర్‌ నమోదు చేసిన ప్రభుత్వం

Published Mon, Sep 4 2023 5:05 PM

Police Case Against 4 Over Editors Guilds Crowdfunded Manipur Report - Sakshi

ఇంఫాల్: మణిపూర్‌లో అల్లర్లను తగ్గుముఖం పట్టించేందుకు ఒకపక్క తాము అహర్నిశలు శ్రమిస్తుంటే మరోపక్క ఎడిటర్స్ గిల్డ్ ఇండియా మీడియా సంస్థ అగ్గికి ఆజ్యం పోసిందని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అదనంగా ఎన్.శరత్ సింగ్ అనే సామాజిక కార్యకర్త కూడా ఈజీఐ పై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు.  

మణిపూర్‌లో కుకీ, మెయిటీ తెగల మధ్య జరిగిన అల్లర్లు చిలికి చిలికి గాలివానై తర్వాతి దశలో పెను ప్రళయంగా మారి దారుణ మారణకాండకు దారితీశాయి. అల్లర్ల సమయంలో జరిగిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సింది పోయి తప్పుడు కథనాలను ప్రచురించి అల్లర్లకు మరింత చెలరేగడానికి కారణమయ్యారని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాపై కేసు నమోదు చేసింది మణిపూర్ ప్రభుత్వం. 

ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా శనివారం ప్రచురించిన కథనం ప్రకారం మణిపూర్ ప్రభుత్వం అల్లర్ల సమయంలో పక్షపాత ధోరణితో వ్యవహరించినట్లు స్పష్టమయ్యిందని.. ప్రజాస్వామ్య ప్రభుత్వంలా ప్రజలపట్ల సమానంగా వ్యవహరించకుండా ఒక పక్షంవైపే నిలిచిందని ఆరోపించింది. ఈ ఆరోపణలు అసత్యమైనవని చెబుతూ మొదట రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్‌ నమోదు చేసింది. 

ఇది కాకుండా ఎడిటర్స్ గిల్డ్ ప్రచురించిన కథనానికి వ్యతిరేకంగా ఇంఫాల్‌కు చెందిన ఒక సామాజిక కార్యకర్త ఎం.శరత్ సింగ్ ఆగస్టు 7 నుంచి 10 లోపు మణిపూర్ వచ్చిన సీమా గుహ, సంజయ్ కపూర్, భారత్ భూషణ్‌లతో పాటు ఎడిటర్స్ గిల్డ్ ఆ ఇండియా ప్రెసిడెంట్ పైన కూడా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.  నివేదికలో ఉన్నఅనేక తప్పిదాలను సాక్ష్యాధారాలతో సహా ఎఫ్ఐఆర్‌లో ఏకరువు పెట్టారు. 

ఎఫ్ఐఆర్‌లో మే 3న నిప్పుల్లో కాలుతోన్న మణిపూర్ అటవీ శాఖాధికారి గృహం ఫోటోకు కింద 'తగలబడుతున్న కుకీ గృహం' అని ఎడిటర్స్ గిల్డ్ ప్రచురించిందని పేర్కొన్నారు. దీనికి సాక్ష్యంగా అదే రోజున స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్‌ను జతచేశారు. ఆ స్టేషన్ ఎస్ఐ జంగ్‌ఖొలాల్ కిప్‌జెన్ మాట్లాడుతూ ఇది కుకీలు నివాసం కాదని అల్లర్ల సమయంలో నిరసనకారులు తగలబెట్టిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇల్లని స్పష్టం చేశారు. దీంతో నాలుక్కరుచుకున్న ఎడిటర్స్ గిల్డ్ తమ తప్పును అంగీకరిస్తూ సెప్టెంబర్ 2న ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొంటూ.. అసలు వివరాలు త్వరలోనే తెలియజేస్తామని ప్రకటించింది. 

అంతకు ముందు ఎడిటర్స్ గిల్డ్ ఇచ్చిన నివేదిక ప్రకారం మయన్మార్ మిలటరీ తిరుగుబాటు కారణంగా అక్కడి నుండి వలస వచ్చిన వారితో కలిపి మణిపూర్ ప్రభుత్వం కుకీలను కూడా వలసదారులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందని ఆరోపించింది. కుకీలకు వ్యతిరేకంగా వ్యవహరించి మణిపూర్ ప్రభుత్వం అత్యధికులు ఆగ్రహానికి కారణమైందని రాసింది.            

ఈ విషయాన్ని కూడా శరత్ సింగ్ ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావిస్తూ అక్రమ వలసదారులకు సంబంధించి ఈజీఐ కీలక సమాచారాన్ని ప్రచురించలేదని 2001తో పోలిస్తే సెన్సస్ 169 శాతం పెరిగిందని.. దీనిపై వారు కథనాన్ని ప్రచురించి ఉంటే బాగుండేదని అన్నారు. ఇటీవల ఎలక్షన్ కమీషన్ ఓటర్ల జాబితాలో భారీ అవకతవకలు జరిగాయని సుమారు 1,33,553 డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లుగా వారు గుర్తించారని తెలిపారు.     

కొండ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కేవలం 10 శాతం అభివృద్ధి ఐదులను మాత్రమే వినియోగిస్తోందని ఎడిటర్స్ గిల్డ్ ప్రచురించిన కథనం కూడా అవాస్తవమని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి నిధులలో దాదాపు 40 శాతం గిరిజనులు నివసించే కొండప్రాంతాలకే వెచ్చింస్తోందని తెలిపారు..    

ఇలా అడుగడుగునా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అనేక తప్పుడు కథనాలను ప్రచురించి పజాలను ఏమార్చి విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని శరత్ సింగ్ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ ఎఫ్ఐఆర్‌పై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఇంకా స్పందించాల్సి ఉంది. 

ఇది కూడా చదవండి: ఉదయనిధి 'సనాతన ధర్మ' వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన ఏంటంటే..?

Advertisement
Advertisement