Police Complaint Against Punjab CM Bhagwant Mann Over Allegedly Entered Into Gurudwara In Drunk State - Sakshi
Sakshi News home page

వివాదంలో పంజాబ్‌ సీఎం.. పోలీసు కేసు నమోదు!

Published Sat, Apr 16 2022 3:43 PM

Police Complaint Against CM Bhagwant Mann In Punjab - Sakshi

ఛండీగఢ్‌: పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ సింగ్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై శనివారం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. బీజేపీ నేత తజీందర్‌ పాల్‌ సింగ్‌ బగ్గా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం పంజాబ్‌లో కలకలం రేపుతోంది. 

వివరాల ప్రకారం.. సీఎం భగవంత్‌ మాన్‌ ఏప్రిల్‌ 14వ తేదీన మద్యం సేవించి గురుద్వారాలోకి ప్రవేశించారని తజీందర్‌ సింగ్‌ తెలిపారు. అయితే, దేశవ్యాప్తంగా జరుపుకునే బైసాఖీ సందర్భంగా పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ మద్యం సేవించిన స్థితిలో తఖ్త్ దమ్‌దామా సాహిబ్‌లోకి ప్రవేశించారని శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (ఎస్‌జిపిసి) అంతకుముందు శుక్రవారం ఆరోపించింది.

దీంతో తాజాగా బీజేపీ నేత బగ్గీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఈ క్రమంలోన సీఎం క్షమాపణలు చెప్పాలని కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ సందర్బంగా భగ్గా.. ట్విట్టర్‌ వేదికగా తన ఫిర్యాదు మేరకు సీఎంపై చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని కోరారు.   

‘అతనో పచ్చి తాగుబోతు.. డ్రగ్స్ కూడా వాడతాడు.. నిత్యం నిషాలో జోగుతుండే మాన్. బఫూన్‌ వేశాలేసుకునేటోడు. అతన్నే గనుక గెలిపిస్తే పంజాబ్ మొత్తాన్నీ మత్తులో ముంచేస్తాడు.. ’ ఇదీ.. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు భగవంత్ మాన్‌పై చేసిన ఆరోపణ.

కాగా, భగవంత్‌ మాన్‌ మద్యం సేవించి పార్లమెంటుకు వస్తారని ఆరోపణలున్నాయి. సహచర ఎంపీలు ఆయన నుంచి  వచ్చే మద్యం వాసన భరించలేక ఫిర్యాదులు కూడా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యర్థి నేతలు.. ‘అతనో పచ్చి తాగుబోతు.. డ్రగ్స్ కూడా వాడతాడు.. నిత్యం నిషాలో జోగుతుండే మాన్‌ను గెలిపిస్తే పంజాబ్ మొత్తాన్నీ మత్తులో ముంచేస్తాడని ఆరోపించారు.

అయితే.. రెండేళ్ల క్రితం బర్నాలాలో జరిగిన ఒక ర్యాలీలో తాను ఇంక మద్యం జోలికి వెళ్లనంటూ ప్రజలందరి మధ్య ప్రతిజ్ఞ చేశారు. మద్యం మానేశానని, ప్రజాప్రతినిధిగా, పంజాబ్ సీఎంగా కళ్లు నెత్తికెక్కించుకోకుండా.. బాధ్యతగా మసలుకుంటానని ఎన్నికల ప్రచారంలో మాన్ ప్రజలకు చెప్పారు.

Advertisement
Advertisement