రాష్ట్రపతి రిపబ్లిక్ డే ప్రసంగంలో అయోధ్య ప్రస్తావన | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి రిపబ్లిక్ డే ప్రసంగంలో అయోధ్య, కర్పూరి ఠాకూర్ ప్రస్తావన

Published Thu, Jan 25 2024 8:02 PM

President Murmu In Republic Day Eve Address - Sakshi

ఢిల్లీ: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరం, భారతరత్న పొందిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌ గురించి ప్రస్తావించారు. అయోధ్యలో మహిమాన్వితమైన రామ మందిర ప్రారంభోత్సవాన్ని ముర్ము ప్రశంసించారు. అయోధ్యను భారతదేశ నాగరికత వారసత్వానికి మైలురాయిగా చరిత్రకారులు భావిస్తారని చెప్పారు. 

భారతరత్న అవార్డు పొందిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు ముర్ము నివాళులర్పించారు. సామాజిక న్యాయం కోసం ఆయన అవిశ్రాంతంగా పోరాడారని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం అవిశ్రాంతంగా పోరాడిన కర్పూరి ఠాకూర్‌ శత జయంతి ఉత్సవాలు ముగిశాయని పేర్కొన్న ముర్ము.. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.

 ప్రజాస్వామ్యానికి తల్లి..
భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పాశ్చాత్య ప్రజాస్వామ్య భావన కంటే  భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా పురాతనమైనదని చెప్పారు. భారతదేశం అమృత్‌కాల్ దశలో ఉందని పేర్కొన్న ముర్ము.. దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే సువర్ణావకాశం దేశ ప్రజలకు ఉందని పేర్కొన్నారు.

'దేశం అమృత్ కాల్ ప్రారంభ సంవత్సరాల్లో ఉంది. ఇది పరివర్తన సమయం. దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు మనకు సువర్ణావకాశం లభించింది. మన లక్ష్యాలను సాధించడంలో ప్రతి పౌరుడి సహకారం చాలా కీలకం.’’ అని ఆమె అన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ గురించి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడారు. టెక్నాలజీ మన జీవితంలో ఎలా భాగమైందో కూడా వివరించారు. 'అమృత్ కాల్' కాలం అపూర్వమైన సాంకేతిక మార్పుల కాలం అని ముర్ము పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతిక పురోగతులు మన దైనందిన జీవితంలో భాగమవుతున్నాయని చెప్పారు. యువత కొత్త సరిహద్దులను అన్వేషిస్తోందని తెలిపిన ముర్ము.. వారి మార్గం నుండి అడ్డంకులను తొలగించడానికి, వారి పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసేందుకు మనం చేయగలిగినదంతా చేయాలని అన్నారు.

ఇదీ చదవండి: జైపూర్‌లో మోదీ, మాక్రాన్ రోడ్ షో

Advertisement
Advertisement