ఈసీ కీలక నిర్ణయం.. రాజస్థాన్ ఎన్నికల తేదీ మార్పు..
Published
Wed, Oct 11 2023 4:55 PM
న్యూఢిల్లీ: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్లో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా మార్పులు చేసింది. రాజస్థాన్ అసెంబ్లీకి ముందుగా ప్రకటించిన నవంబర్ 23 బదులు.. నవంబర్ 25న ఎన్నికలు నిర్వహించనున్నట్లు బుధవారం వెల్లడించింది. ఎన్నికల ఫలితాలను మిగతా నాలుగు రాష్ట్రాలతోపాటు డిసెంబర్ 3న వెల్లడించనున్నట్లు తెలిపింది.
అయితే నవంబర్ 23న రాష్ట్రంలో పెద్ద ఎత్తున వివాహాలు, ఇతర కార్యక్రమాలు ఉన్నట్లు ఈసీ తెలిపింది. ఈ క్రమంలో భారీ సంఖ్యలో ప్రజలకు అసౌకర్యం కలిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అదే విధంగా రవాణా విషయంలోనూ సమస్యలు తలెత్తి పోల్ సమయంలో ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్నికల తేదీలను వాయిదా వేసినట్లు ఈసీ పేర్కొంది. వివిధ రాజకీయ నాయకులు, సామాజిక సంస్థలు, చేసిన విజ్ఙప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
కాగా తెలంగాణ, మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన విషయం తెలిసిందే. అయిదు రాష్ట్రాలకు ఎన్నికల తేదీలను, ఓట్ల లెక్కింపు తేదీలను ప్రకటించింది.
దీని ప్రకారం తెలంగాణలో నవంబర్ 30న, రాజస్థాన్లో నవంబర్ 25న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఛత్తీస్గఢ్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 7న తొలి విడత, నవంబర్ 17న రెండో విడతలో పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్లో నవంబర్ 17న పోలింగ్ జరగగా.. మిజోరాంలో నవంబర్ 7న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఐదు రాష్ట్రాలకు డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది.
ECI changes the date of Assembly poll in Rajasthan to 25th November from 23rd November; Counting of votes on 3rd December pic.twitter.com/lG1eYPJ4Hg