సాక్షి, ఢిల్లీ: కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా శంభు సరిహద్దుల వద్ద రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో రైతు సంఘాల నేతలు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు భవిష్యత్ కార్యచరణపై రైతులు చర్చించనున్నారు. ఇక, ఈనెల 26వ తేదీన అన్ని జాతీయ రహదారులపై రైతులు ట్రాక్టర్ మార్చ్ నిర్వహించనున్నారు.
ఇదిలా ఉండగా.. పంబాజ్-హర్యానా సరిహద్దుల్లో ఖనౌరి వద్ద బుధవారం చోటుచేసుకున్న రైతు మరణంపై హర్యానా ముఖ్యమంత్రి, హోం మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రైతు మృతికి సంతాపం ప్రకటిస్తూ దేశవ్యాప్తంగా శుక్రవారం ‘బ్లాక్ డే’గా పాటించాలని రైతులను కోరింది.
మరోవైపు.. ఈ నెల 26వ తేదీన రైతులంతా తమ ట్రాక్టర్లతో జాతీయ రహదారులను దిగ్బంధించాలని పిలుపునిచ్చింది. అదేవిధంగా, మార్చి 14వ తేదీన ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో మహాపంచాయత్లో చేపట్టనున్నట్లు తెలిపింది. ఢిల్లీ చలో కార్యక్రమాన్ని సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా(కేఎంఎం)లు కలిసి చేపట్టగా ఎస్కేఎం మద్దతు మాత్రమే ఇస్తోంది. 2020–21లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘంగా పోరాడిన ఎస్కేఎం నేతలెవరూ ‘ఢిల్లీ చలో’లో పాలుపంచుకోవడం లేదు.