రెండో పెళ్లికి అడ్డుగా ఉన్నాడని.. 27 ఏళ్ల కుమారుని హత్య! | Sakshi
Sakshi News home page

తన పెళ్లికి అడ్డుగా ఉన్నాడని.. పెళ్లీడు కుమారుని హత్య!

Published Mon, Aug 28 2023 1:58 PM

son killed by father over second marriage issue - Sakshi

యూపీలోని మీరఠ్‌లో సర్ఘన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హృదయాలను కలచివేసే ఉదంతం చోటుచేసుకుంది. ఒక తండ్రి తన స్నేహితులతో కలసి తన 27 ఏళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ హత్య కోసం ఆ తండ్రి కిరాయి హంతకులకు రూ.5 లక్షలు చెల్లించాడు. ఆ తండ్రి ముందుగా తన కుమారుని చేత మద్యం తాగించాడు. తరువాత హత్య చేసి, మృతదేహాన్ని బాగ్‌పత్‌లోని హిండన్‌ నదిలో పడవేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ తండ్రిని, హత్యకు సహకరించిన మిగిలినవారిని అరెస్టు చేశారు. 

వివరాల్లోకి వెళితే ఈ ఉదంతం ఛురా గ్రామంలో చోటుచేసుకుంది. కిరాయి హంతకులతో కుమారుడిని హత్య చేయించిన తండ్రి రిటైర్డ్‌ జవాను కావడం విశేషం. ప్రస్తుతం ఒక బ్యాంకులో గార్డుగా పనిచేస్తున్నాడు. తండ్రి (సంజీవ్‌ కుమార్‌) రెండవ వివాహం చేసుకోవడం కుమారునికి(సచిన్‌)ఇష్టం లేదు. ఈ నేపధ్యంలో తండ్రీకొడుకుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. 

సంజీవ్‌.. అతని భార్య మునేష్‌ మధ్య గత 15 సంవత్సరాలుగా మనస్పర్థలు ఉండటంతో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. వారి 27 ఏళ్ల ఏకైక కుమారుడు తల్లి మునేష్‌తో పాటు ఉంటున్నాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మునేష్‌ దేవి అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపధ్యంలో కుమారుడు సచిన్‌ ఆమెను చూసేందుకు ఆసుపత్రికి వెళ్లాడు. కుమారుడు ఎంతసేపటికీ ఆసుపత్రికి రాకపోవడంతో అనుమానంతో తల్లి మునేష్‌.. కుమారుని అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

దర్యాప్తు చేపట్టిన పోలీసులకు తండ్రి సంజీవ్‌పై అనుమానం కలిగింది. వెంటనే వారు అతనిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో మొదట్లో తనకు తెలియదని బుకాయించినా, తరువాత తానే తన కుమారుడిని రూ. 5 లక్షలకు సుపారీ కుదుర్చుకుని హత్య చేయించానని ఒప్పుకున్నాడు. పోలీసులు సంజీవ్‌పై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. 
ఇది కూడా చదవండి: నాలుగేళ్ల ఎదురుచూపు.. ఒకే కాన్పులో నలుగురు పిల్లలు

Advertisement
Advertisement