మనిలాండరింగ్‌ కేసులో మాజీ మంత్రి.. ఈడీకి సుప్రీం కీలక ఆదేశాలు | Sakshi
Sakshi News home page

మనిలాండరింగ్‌ కేసులో మాజీ మంత్రి.. ఈడీకి సుప్రీం కీలక ఆదేశాలు

Published Mon, Apr 1 2024 3:53 PM

Supreme Court Notice To Ed On Bail Plea Of Former Minister Senthil Balaji In Money Laundering Case - Sakshi

మనీలాండరింగ్ కేసులో గత ఏడాది అరెస్టైన తమిళనాడు మాజీ మంత్రి వి.సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నుంచి స్పందన కోరింది. సెంథిల్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్ 29లోగా సమాధానం ఇవ్వాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈడీని ఆదేశించింది. అంతకుముందు సెంథిల్‌ బెయిల్‌ పిటిషన్‌పై మద్రాస్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  

మనిలాండరింగ్‌ కేసులో బెయిలా 
ఫిబ్రవరి 28న సెంథిల్‌ బెయిల్‌ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఆ సమయంలో మనిలాండరింగ్‌ వంటి అసాధారణ కేసుల్లో బెయిల్‌ ఇవ్వడం తప్పుడు సంకేతాలు పంపుతుందని, అది ప్రజాప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొంది. అంతేకాదు, పిటిషనర్ ఎనిమిది నెలలకు పైగా జైలు శిక్ష అనుభవించారని, అందువల్ల ఈ కేసును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ప్రత్యేక కోర్టును ఆదేశించడం సముచితంగా ఉంటుందని పేర్కొంది.

సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా
దీని ప్రకారం ఈ ఉత్తర్వుల కాపీ అందిన తేదీ నుంచి మూడు నెలల్లో కేసును పరిష్కరించాలని చెన్నై ప్రిన్సిపల్ స్పెషల్ కోర్టును కోరాలని ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రోజువారీగా విచారణ జరపాలని చెన్నై హైకోర్టు ఆదేశించింది.

మనీ లాండరింగ్‌ కేసు 
గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్‌ బాలాజీ నిరుద్యోగుల నుంచి భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈడీ అధికారులు సెంథిల్‌ బాలాజీని గత ఏడాది జూన్‌ 14న అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తున్న ఆయన పలు మార్లు బెయిల్‌ కోసం అప్లయి చేశారు. తాజాగా సెంథిల్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు ఈడీకి కీలక ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Advertisement