నందిపేట్ మండలం లక్కంపల్లి శివారులో పెరుగుతున్న ఆయిల్పాం మొక్కలు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): జిల్లాలో ఆయిల్ పాం సాగు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. 2022–23 సంవత్సరానికి జిల్లాకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో ఉద్యాన శాఖ వెనుకబడింది. అధికారులు చేతులెత్తేయడంలో టార్గెట్ లో కనీసం 50 శాతాన్ని కూడా మించలేదు. రైతుల ను చైతన్యం చేయడంలో విఫలమయ్యారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోయింది. తద్వారా జిల్లాలో ఆయిల్పాం సాగు అంతంతమాత్రంగానే జరుగుతోంది. కాగా రైతులు లాభదాయకమైన ఆయిల్పాం పంటను సాగుచేసే దిశగా చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో రాష్ట్ర శాఖ అసంతృప్తిగా ఉంది. గతేడాది జూన్, జూలై నెలలు కలిపి 2వేల ఎకరాలు, నవంబర్, డిసెంబర్ కలిపి నాలుగు వేల ఎకరాల్లో ఆయిల్పాం పంటను సాగు చేయాలని ప్రభుత్వం జిల్లాకు లక్ష్యాన్ని నిర్దేశించింది. డిసెంబర్ నాటికే వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉండగా, రైతులు ముందుకు రాలేదు. ఉద్యాన శాఖ అధికారులతో కాకపోవడంతో వ్యవసాయాధికారుల సహాయంతో క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ ఏడాది మార్చి నాటికి 6వేల ఎకరాల్లో సాగు చేయించాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 2,650 ఎకరాల్లో మాత్రమే సాగవుతోంది. వీటికి డ్రిప్ ఇరిగేషన్ సిస్టంను కూడా మంజూరు చేశారు. అయితే మిగులు లక్ష్యాన్ని వచ్చే ఏడాదిలో పూర్తి చేయాలని ఉద్యాన శాఖ అధికారులు నిర్ణయించుకున్నారు.
సులభతర పంటలకు అలవాటైన రైతులు
ఆయిల్పాం పంటను సాగు చేయడానికి రైతులు పెద్దగా ముందుకు రాకపోవడానికి పలు కారణాలున్నాయి. అందులో ప్రధానంగా రైతులు సులభతర పంటలైన వరి, మొక్కజొన్న, సోయా ఇతర పంటలు సాగు చేయడం అలవాటుగా మారిపోయింది. ఏడాదిలో రెండు నుంచి మూడు పంటలు తీసి ప్రభుత్వానికి అమ్మడం పరిపాటిగా మారింది. దీంతో ఎక్కువ కాలం వేచి చూసే ఆయిల్ పాం పంటను సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆర్థికంగా బాగున్న రైతులే ముందుకు వచ్చారు. సబ్సిడీపై ఆయిల్పాం మొక్కలను, అంతర పంటలు సాగు చేయడానికి ఆర్థిక సాయం, రాయితీపై డ్రిప్ పరికరాలు ఇస్తున్నా కూడా రైతులు ఈ పంటను వేసేందుకు రైతులు ముందుకు రావడం లేదు. కాగా, ప్రభుత్వం అందించే సబ్సిడీ సకాలంలో రావడం లేదనే కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.
3,350
2,650
6,000
అనుకున్న స్థాయిలో జరగని ఆయిల్పాం పంట సాగు
టార్గెట్లో 50 శాతం కూడా
మించని వైనం
ఆరు వేల ఎకరాలకు సాగైంది
2,650 ఎకరాలే..
మిగులు లక్ష్యాన్ని వచ్చే ఏడాదిలో పూర్తి చేయాలని నిర్ణయించిన ఉద్యాన శాఖ
జూన్ నుంచి మిగులు లక్ష్యాన్ని పూర్తిచేస్తాం
ఈ ఏడాదికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంలో 40 శాతం పూర్తి చేశాం. మిగిలిన లక్ష్యాన్ని జూన్ నెల నుంచి పూర్తి చేయడానికి ప్రణాళికలు రూ పొందిస్తాం. రైతులను మరింత చైతన్యం చేసి ఆయిల్ పాం వైపు మళ్లిస్తాం.
– నర్సింగ్దాస్, ఉద్యాన శాఖ అధికారి