బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి సరఫరా చేసే కాకతీయ కాలువ, వరద కాలువల్లో నీరు సమృద్ధిగా ఉంది. దీంతో మండుటెండల్లో సైతం రెండు కాలువల్లో నీరు నిండుకుండల ఉండటంపై ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా గత వారం రోజుల క్రితం స్వల్పంగా నీటి విడుదల చేపట్టి కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ గ్రామం వద్ద క్రాస్ రెగ్యులేటర్ గేట్ల తలుపులను మూసివేశారు. దీంతో కాలువలో నిండుకుండల నీరు నిల్వ ఉంది. కాకతీయ కాలువ నీటి ఆధారంగా కాలువకు ఇరువైపులా పంట భూములు గల రైతులు పైపులైన్లను వేసుకున్నారు. కాలువకు మోటర్లను అమర్చుకుని పంట భూములకు నీటి సరఫరా చేపట్టుకుంటున్నారు. ప్రస్తుత రోహిణికార్తె రావడంతో ఖరీఫ్ పంట సాగు ప్రారంభించనున్నారు. కాలువలో ఉన్న నీటి ద్వారా మక్క పంటను సాగు చేయుటకు రైతులు సిద్ధమవుతున్నారు.
రివర్స్ పంపింగ్తో నీటి మళ్లింపు..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ మిగులు జలాలను సద్వినియోగ పరుచుటకు నిర్మించిన వరద కాలువ ప్రస్తుతం కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీకి నీటిని మళ్లీంచుటకు ఉపయోగపడుతుంది. ఆ కాలువలో కూడ ప్రస్తుతం నీరు నిండు కుండల ఉంది. ఈ కాలువ ఆధారంగా కూడ రైతులు పైపులైన్లు వేసుకొని మోటర్లు బిగించుకున్నారు. ప్రస్తుతం వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీ నుంచి నీటి సరఫరా చేసే అవకాశం లేదు. ప్రాజెక్ట్ నీటిమట్టం 1075 అడుగులు ఉన్నంత వరకు మాత్రమే నీటి సరఫరా చేపట్టవచ్చు. కానీ ప్రస్తుతం ప్రాజెక్ట్లో 1062 అడుగుల నీటి మట్టం మాత్రమే ఉంది. దీంతో రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం నీళ్లను వరద కాలువలో నిల్వ చేశారు. దీంతో కాలువలో నీరు సమృద్ధిగా ఉంది.
సమృద్ధిగా భూగర్బ జలాలు..
కాకతీయ, వరద కాలువల్లో నీరు నిల్వ ఉండటం వల్ల కాలువల దిగువనున్న నేలల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. కాలువలో నీరు నిల్వ ఉండటంతో రెండు కాలువల పక్కన గల భూముల్లో నీరు సమృద్ధిగా ఉంది. దీంతో గతంలో కాలువల కోసం భూములు కోల్పోయిన రైతులకు ప్రస్తుతం నీటినిల్వతో మిగిలిన భూముల్లో పంటలను ముందస్తుగా సాగు చేసుకునే అవకాశ మాత్రం మిగిలింది. గత ఆరేళ్ల క్రితం కాకతీయ కాలువ ద్వారా లీకేజీ నీటిని విడుదల చేయాలని ఆయకట్టు రైతులు రోడ్డెక్కారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కాలువల్లో నీరు నిల్వ ఉండటంపై అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు ఉపయోగకరం..
కాకతీయ కాలువలో నీరు ని ల్వ ఉండటం వల్ల ముందస్తు గా పంటలను విత్తుకునే అవకాశం ఉంది. కాకతీయ కాలు వ ద్వారా నీటి విడుద ల చేప ట్టి నిల్వ ఉంచడం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. మంత్రి ప్రశాంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని కాలువల్లో నీటిని నిల్వ ఉంచుతున్నారు. ఆయనకు రుణపడి ఉంటాం.
– రాజేందర్, ఆయకట్టు రైతు, బాల్కొండ
మండు టెండల్లోనూ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కాలువల్లో భారీగా నీటి నిల్వ