జూలై 1 నుంచి ఆపరేషన్‌ ముస్కాన్‌–9 | Sakshi
Sakshi News home page

జూలై 1 నుంచి ఆపరేషన్‌ ముస్కాన్‌–9

Published Wed, Jun 28 2023 1:04 AM

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న డీసీపీ(అడ్మిన్‌) మధుసూదన్‌రావు - Sakshi

ఖలీల్‌వాడి: జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమం నిర్వహించాలని డీసీపీ(అడ్మిన్‌) మధుసూదన్‌రావు ఆదేశించారు. ఇన్‌చార్జి సీపీ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌లో వివిధ శాఖల అధికారులతో ఆపరేషన్‌ ముస్కాన్‌–9 సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ(అడ్మిన్‌)మాట్లాడుతూ నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 18 ఏళ్లలోపు తప్పిపోయిన, వదిలేసిన, కార్మికులుగా ఉన్న బాలబాలికలు ఉన్నట్లయితే.. అలాంటి వారి సమాచారం సేకరించి రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించాలన్నారు.

బాలలతో బలవంతంగా భిక్షాటన చేయించిన వారిపై, వెట్టి చాకిరి చేయించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు. ప్రత్యేకంగా డివిజన్‌ పరిధిలో ఎస్సై, నలుగురు సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. ప్రజలు తప్పిపోయిన బాలురు, బాలికలు ఉన్నట్లయితే అలాంటి వారి సమాచారం, బాలకార్మికుల గురించి సమాచారం తెలిస్తే డయల్‌ 100, స్పెషల్‌ బ్రాంచ్‌ కంట్రోల్‌ రూం సెల్‌ నెంబర్‌ 87126– 59777, నిజామాబాద్‌ ఇన్‌చార్జి ఎస్సై 80965– 73004, ఆర్మూర్‌ ఇన్‌చార్జి ఎస్సై 94401–40022, బోధన్‌ ఇన్‌చార్జి ఎస్సై 94412–50992 నంబర్లకు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.

సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని తెలిపారు. సమావేశంలో ఎస్‌బీ శ్రీశైలం, సీసీఆర్‌బీ మోహన్‌, యాంటి హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ సీఐ గోపినాథ్‌, జిల్లా లేబర్‌ ఆఫీసర్‌ యోహన్‌, జిల్లా సంక్షేమ అధికారి రసూల్‌బీ, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ సంపూర్ణ, జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్య, బాల రక్ష భవన్‌ కో–ఆర్డినేటర్‌ విజయలక్ష్మి, నిజామాబాద్‌ ఇన్‌చార్జి మహిళా ఆర్‌ఎస్సై స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement