పెర్కిట్/ ఆర్మూర్టౌన్: బీఆర్ఎస్, బీజేపీలు ఒకే నాణెంపై ఉన్న రెండు బొమ్మలని అలాగే ఎంఐఎం పార్టీ సైతం వారికి తొత్తుగా వ్యవహరిస్తోందని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్లో శుక్రవారం కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఎంఐఎం మైనార్టీ ఓట్లను చీల్చడానికి ముస్లిం జనాభా లేని చోట అభ్యర్థులను నిలబెడుతూ బీజేపీ, బీఆర్ఎస్లకు పరోక్షంగా మద్దతు తెలుపుతోందన్నారు. మద్యం, సర్కారు భూముల విక్రయంతో వచ్చిన ఆదాయంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్తోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమన్నారు. అంతకుముందు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో నిర్వహించిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. అనంతరం చవాన్ను నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకురాలు సాజీదా బేగం, నాయకులు కోల వెంకటేశ్, ముస్కు వెంకట్రాం రెడ్డి, ఏలేటి రవికాంత్రెడ్డి, జిమ్మి రవి, మీసాల రవి, జీవన్ రెడ్డి, మీర్ మాజీద్ అలీ, కొంతం మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్