నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్పేట వారాంతపు సంతలో సోమవారం బీజేపీ కళాకారులు పాటలు పాడుతూ ఎన్నికల ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు. బీజేపీ కళాకారులు పాటలు పాడుతూ ప్రచారం చేపట్టగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇమామ్, గులాంతోపాటు మరికొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కళాకారులను అడ్డుకొని బెదిరించినట్లు బీజేపీ మండల నాయకుడు ధనుంజయ్ ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
తనిఖీల్లో నగదు స్వాధీనం
భిక్కనూరు: భిక్కనూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద సోమవారం వాహనాలను తనిఖీలో రూ.1.81లక్ష లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సాయికుమార్ శనివారం తెలిపారు. నిర్మల్ పట్టణానికి చెందిన చిక్కెసీ రంజిత వాహనం తనిఖీ చేయగా రూ.1.01 లక్షలు, నిర్మల్ జిల్లా ముదోలుకు చెందిన యెర్రం మహేష్ వద్ద రూ. 80వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మద్యం సీసాలు..
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలం మత్తమాల, జంగమాయిపల్లి గ్రామాలకు చెందిన నలుగురు యువకులు 150 క్వార్టర్ల మద్యం సీసాలను తరలిస్తుండగా సీజ్ చేసినట్లు ఎస్సై గణేష్ సోమవారం తెలిపారు. పట్టణంలోని చెరువుకట్ట ప్రాంతంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా బైక్పై అక్రమంగా మద్యం తరలిస్తు న్న వారి నుంచి సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.