నిజామాబాద్ నాగారం : ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి అన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని, అందరితో సమానంగా దళితులు కూడా ఆర్థికంగా ఎదగాలన్న ఉద్ధేశంతో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. మంగళవారం నగరంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పలు మాదిగ సంఘాల నాయకులు సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి వారు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కల్వకుంట్ల కవిత మా ట్లాడుతూ దళితబంధు వల్ల వచ్చిన ఆర్థిక సాయంతో చేస్తున్న వ్యాపారాలకు కూడా దళిత రక్షణ నిధి పేరిట బీమా సౌకర్యాన్ని సీఎం కల్పించారన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో, మెడికల్ షాపుల స్థాపించుకోవడంలోనూ ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. మాదిగ సంఘాల నాయకులు మాట్లాడుతూ దళిత బంధుతో తమకు సీఎం కేసీఆర్ పునర్జన్మను ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా బోధన్ నియోజకవర్గానికి చెందిన రెడ్డికా కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి, పర్దె రాజు నేతృత్వంలో మంగళవారం నగరంలో ఎమ్మెల్సీ కవితతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్కు పూర్తి మద్దతుగా ఉంటామన్నారు.
ముదిరాజ్ల హక్కులను కాపాడుతాం
ఉమ్మడి ఏపీలో మత్స్య సొసైటీలు నిర్వీర్యమయ్యాయని, సీఎం కేసీఆర్ వాటిని సరిదిద్దారని, ముదిరాజ్ల హక్కులను కాపాడుతామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గతంలో కాంట్రాక్టర్లు చెరువుల్లో చేపపిల్లలను వేసేవారని, ఇప్పుడు నేరుగా ప్రభుత్వమే చెరువుల్లో ఉచితంగా చేపపిల్లలను వదులుతోందన్నారు.
జిల్లాకు చెందిన ముదిరాజ్ కుల సంఘం నేతలు మంగళవారం ఎమ్మెల్సీ కవితతో సమావేశమయ్యారు. సొసైటీల ఏర్పాటు, నిర్వహణ విషయంలో ఉన్న కొన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేందుకు కృషి చేస్తోందన్నారు. జిల్లాలో ముదిరాజ్ భవనం నిర్మాణానికి భూమి, నిధులు మంజూరు చేసేలా చూస్తానన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కవిత ముదిరాజ్ కులస్తులతో పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పించడానికి జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
దళితులను ఆదుకునేందుకే
దళితబంధు పథకం
మాదిగ సామాజిక వర్గం
సమావేశంలో ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన
కుల సంఘాలు