● మంత్రి హరీశ్ రావు సోదరుడు మహేశ్ రావు
బీబీపేట: గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధి పనులు కేవలం బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని, ఆ ఘనత కేసీఆర్దేనని మంత్రి హరీశ్రావు సోదరుడు మహేశ్రావు అన్నారు. మంగళవారం ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుడు తిమ్మయ్య గారి సుభాష్రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పలు ప్రధాన కాలనీల్లో ర్యాలీ నిర్వహించిన అనంతరం ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే ఇదే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అన్నారు. ప్రచారంలో ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుడు తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్కుమార్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కరాటేలో మెడల్స్ సాధించిన తాడ్వాయి విద్యార్థులు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు కరా టేలో జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. 8వ తరగతి చదువుతున్న నామాల నవ్యశ్రీ, కేపీ సింధూలు ఈ నెల 19న మేడ్చల్ జిల్లాలో జరిగిన కరాటే పోటీల్లో జాతీయ స్థాయిలో ఆడి ప్రతిభను కనబరిచారన్నారు. నవ్యశ్రీకి సిల్వర్ మెడల్, సింధు బ్రాంచ్ మెడల్ సాధించిందన్నారు. వీరిని ఉపాధ్యాయులు, కోచ్ అజ్జపల్లి నీరజ అభినందించారు.
పేకాట స్థావరంపై దాడి
ఇందల్వాయి: మండలంలోని నల్లవెల్లిలో పేకాట స్థావరంపై స్పెషల్ టాస్క్పోర్స్ సిబ్బంది మంగళవారం దాడి చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. దాడిలో 13 మందిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 9,970 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.