సుభాష్నగర్: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని 16, 17, 39, 41, 42 డివిజన్లలో బీజేపీ కార్యకర్తలు, ఓటర్లపై పోలీసులు లాఠీచార్జ్జి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుమిగూడారని గంగస్థాన్, సుభాష్నగర్, దుబ్బలో పోలీసులకు లాఠీలకు పనిచెప్పారు. దీంతో అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలతోపాటు ఓటర్లకు గాయాలయ్యాయి. అంతేగాకుండా ఓటర్ లిస్టులను చించేశారని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. లాఠీచార్జితో గాయపడ్డ వారిని బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ పరామర్శించారు. తలకు గాయమైన కార్యకర్తకు ఆస్పత్రిలో చికిత్స అందించారు. పోలీసులు బీజేపీ నాయకులు, ఓటర్లపై లాఠీచార్జి చేయడాన్ని ధన్పాల్ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో హిందువుల ఓట్ల శాతం తగ్గించేందుకు పోలీసులు బీఆర్ఎస్కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. హిందువుల ఓట్లు అధికంగా నమోదవుతున్న పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఓటేయకుండా భయబ్రాంతులకు గురి చేశారని విమర్శించారు. మహిళలని చూడకుండా కొట్టారన్నారు. ఆరెంజ్ రంగు చొక్కాలు, చీరలు కట్టుకున్న వారిని వెంటనే మార్చేయాలని బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీజేపీ గెలుస్తుందనే ఫ్రస్టేషన్లో పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మైనారిటీ ఏరియాల్లో స్వేచ్ఛగా వదిలేస్తూ.. హిందువులు అధికంగా ఉన్న కేంద్రాల్లో నిబంధనలు కఠినంగా అమల్జేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారితోపాటు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఆయన వెంట ఫ్లోర్లీడర్ స్రవంతిరెడ్డి, కొండా ఆశన్న, విజయ్ కృష్ణ, భాస్కర్రెడ్డి, రంజిత్ ఉన్నారు.
బీజేపీ కార్యకర్తలు, ఓటర్లకు గాయాలు
ఖండించిన బీజేపీ అభ్యర్థి ధన్పాల్