సదాశివనగర్: మండలంలోని పద్మాజీవాడి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణ పనుల వద్ద వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు రెండు నెలల క్రితం పనులు ప్రారంభించారు. పనుల నేపథ్యంలో ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించారు. ఆ రోడ్లు వాహనాల రద్దీకి సరిపోక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాకుండా ఆ రోడ్లు సక్రమంగా లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. నాణ్యత లేని పనులు చేపట్టడంతో రోడ్డు పక్కన పోసిన మొరం దిగబడుతోంది. భారీ వాహనాలు మట్టిలో కూరుకుపోతున్నాయి. మూడు రోజుల క్రితం నిజామాబాద్ వైపు నుంచి కామారెడ్డి వైపు భారీ లోడ్తో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన మట్టిలో దిగబడింది. దానిని తీయడానికి యత్నించగా ఇంకా మట్టి కూరుకు పోవడంతో పూర్తిగా రోడ్డుకిందికి పోయింది. అయినా సంబంధిత గుత్తేదారు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఇంకా లారీ అలాగే ఉండటంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.