Sakshi News home page

ఎట్టకేలకు షబ్బీర్‌ అలీ సీనియారిటీకి దక్కిన గుర్తింపు..

Published Mon, Jan 22 2024 12:56 AM

- - Sakshi

సాక్షి, కామారెడ్డి: ఎట్టకేలకు మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ సీనియారిటీకి గుర్తింపు దక్కింది. ఆయనను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖల సలహాదారుగా నియమిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సుమారు దశాబ్దకాలం తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే మాజీ మంత్రి, పీఏసీ చైర్మన్‌ షబ్బీర్‌ అలీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి చెందడంతో కొంత నిరాశచెందారు. ఎమ్మెల్యేగా గెలుపొంది ఉంటే ప్రభుత్వంలో కీలకమైన పదవి దక్కేదని భావించారు.

అయితే సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న షబ్బీర్‌అలీ.. మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం, తద్వారా మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ ఆ అవకాశం దక్కలేదు. దీంతో ఆయన అనుచరులు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం మేరకు షబ్బీర్‌ అలీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా (బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖలు) నియమిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఐదేళ్లుగా అధికార పదవి లేకుండా ఉన్న షబ్బీర్‌ అలీకి ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు హోదా లభించడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కాగా షబ్బీర్‌ అలీకి అధికారిక పదవి లభించడంతో కామారెడ్డి నియోజకవర్గంలో రాజకీయాలు మారనున్నాయి. స్థానికంగా అధికార పార్టీ ఆధిపత్యం కోసం ప్రయత్నించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్‌ నేతలు, శ్రేణులు యాక్టివ్‌ అయ్యారు. దీనికి తోడు షబ్బీర్‌కు సలహాదారు పదవి రావడంతో వారు మరింత క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

ఇవి చదవండి: అర్జున్‌ రెడ్డి స్టైల్లో కేటీఆర్‌.. అదిరిన కొత్త లుక్..

Advertisement
Advertisement