NTR Centenary Celebrations In Pennsylvania, US - Sakshi
Sakshi News home page

US Pennsylvania :పెన్సిల్వేనియాలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

Published Mon, Jun 12 2023 12:36 PM

NTR Centenary Celebrations In Pennsylvania - Sakshi

పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌ నగరంలో డిస్కవరీ చర్చి ప్రాంగణంలో  విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ డా.నందమూరి తారకరామారావు శతజయంతిని పురస్కరించుకొని తెలుగువారి ఆత్మగౌరవానికి వందేళ్ళు వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో సుమారు 250 పైచిలుకు అన్న అభిమానులు అందులో ముఖ్యంగా ఆడపడుచులు పెద్ద ఎత్తున హాజరుకావటం విశేషం. జ్యోతి ప్రజ్వలన, చిన్నారులు పాడిన గణేష ప్రార్ధనతో ప్రారంభమైన ఈ వేడుకలో పిల్లలు పెద్దలు ఆద్యంతం ఉత్సహాంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన సేవలు, తెలుగువారికి తెచ్చిన గుర్తింపును పలువురు వక్తలు గుర్తు చేసుకున్నారు. స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించే క్రమంలో ఆ మార్పు తన సొంత ఇంటి నుండే ప్రారంభించటం ఆయన గొప్ప తనానికి, నిబద్దతకి నిదర్శనం అని పాల్గొన్న మహిళలు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.

సినీ, రాజకీయ రంగంలో ఆయన వేసిన ప్రతి అడుగు ఒక సంచలనమే. ఎన్టీఆర్ జీవిత విధానం ఎప్పటికి స్ఫూర్తిదాయకమే అని, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తి మనసావాచ పాటించిన కర్మ యోగి అన్న రామన్న అని గురజాల మాల్యాద్రి, శారదాదేవి పేర్కొన్నారు. ఇంతటి మంచి కార్యక్రమమును నిర్వహించటం ద్వారా మరల ఒక్కసారి ఎన్టీఆర్ తలపెట్టిన వినూత్న నిర్ణయాలను, ఆయన క్రమశిక్షణ తమ రాజకీయ జీవితాలపై ఆయన ప్రభావం మరియు ఇతర విశేషాలను పాల్గొన్న సభ్యులకు గౌతు శిరీష, గద్దె రామోహన్, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ఏలూరి సాంబశివరావు, అడుసుమిల్లి శ్రీనివాసరావు, లింగమనేని శివరామప్రసాద్, కొమ్మారెడ్డి పట్టాభిరాం తమ వీడియో బైట్స్ ద్వారా తెలిపారు. 

మూడు గంటలకు పైగా జరిగిన ఈ కార్యక్రమములో నందమూరి బాలకృష్ణ, జూ.ఎన్.టి.ఆర్ పాటలకు పిల్లలు, పెద్దలు చేసిన నృత్యప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలలో భాగంగా గత నెల మే నెలలో నిర్వహించిన పురుషుల వాలీబాల్ మరియు మహిళలల బ్యాడ్మింటన్ పోటీలలో ప్రధమ, ద్వితీయ విజేతలకు నిర్వహకులు ట్రోఫీలతో పాటు ప్రకటించిన నగదు బహుమతిని అందించారు.

గత కొన్నేళ్ళుగా అమెరికాలో స్ధిరపడి అటు వైద్యరంగంలోను, ఇటు సామాజిక సేవలల్లోను విశిష్ట సేవలు అందిస్తున్న డా.కారుమూడి ఆంజనేయులు మరియు అనురాధ దంపతులకు, డా.రామన్ పురిగళ్ళలను ఎన్.టి.ఆర్ ట్రస్ట్ పిట్స్‌బర్గ్ సభ్యులు సత్కరించారు. వారు చేస్తున్న సేవలు ఎంతో మందికి స్పూర్తిదాయకమని ఉద్ఘాటించారు. 

ఈ కార్యక్రమము నిర్వహణకు ఇంత ఘనంగా జరగటానికి తమ వంతుగా ముందుకు వచ్చిన స్పాన్సర్లకు (Avansa IT Solutions, Shineteck Inc., Uniglobal Technologies Inc., Stellium Force Inc., Midsys Inc., Red Chillies, Chutneys, Getitfromnature Arts Academy, Paturi immigration and real estate law, Manpasand spice corner, Spice n Sabzi , mintt restaurant ), ఈ వేడుకల నిర్వాహకులు వెంకట్ నర్రా, సునీల్ పరుచూరి, హేమంత్ కుమార్ శెట్టి, రవికిరణ్ తుమ్మల, శ్రీహర్ష కలగర, శ్రీ అట్లూరి, రంగరావు తూమాటి, సాయికృష్ణ పాపినేని, సాయి అక్కినేని తమ కృతజ్ఞతలు తెలిపారు. చివరగా తెలుగింటి భోజనాలతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

(చదవండి: మలేషియాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకలు)

Advertisement
Advertisement