Poison Attack Suspect In UK Khalistani Avtar Singh Khanda Death - Sakshi
Sakshi News home page

అమృత్‌పాల్‌ మెంటార్‌ అవతార్‌ ఖాందా మృతి.. విషం పెట్టి చంపారా?

Published Thu, Jun 15 2023 2:17 PM

Poison Attack Suspect In UK Khalistani Avtar Singh Khanda Death - Sakshi

బ్రిటన్‌లో ఖలీస్తానీ లిబరేషన్‌ ఫోర్స్‌ చీఫ్‌ అవతార్‌ సింగ్‌ ఖాందా అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఖలీస్తానీ వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌కి గురువుగా చెప్పుకునే అవతార్‌ సింగ్‌ క్యాన్సర్‌తో కన్నుమూశాడని ప్రకటించినప్పటికీ.. అతనిపై విష ప్రయోగం జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పుడు. ఈ క్రమంలో దర్యాప్తు కొనసాగుతోంది. 

అవతార్‌ సింగ్‌ ఖాందా.. కేఎల్‌ఎఫ్‌ చీఫ్‌ మాత్రమే కాదు, మార్చి 19వ తేదీన లండన్‌లోని భారత్‌ హైకమిషన్‌ ఎదుట భారతీయ జెండాను అవమానించేందుకు ఖలీస్తానీలు ప్రయత్నించిన కుట్రకు ప్రధాన సూత్రధారి కూడా. ఈ ఘటనకు సంబంధించి నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ తన దర్యాప్తులో ఖాందానే ప్రధాన నిందితుడిగా పేర్కొంది కూడా. ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉండి. పోలీసులకు అమృత్‌పాల్‌ సింగ్‌ దొరకకుండా తిరిగిన రోజుల్లోనూ అవతార్‌ అతనికి సహకరించినట్లు తేలింది కూడా. 

అవతార్‌ ఖాందా బ్యాక్‌గ్రౌండ్‌ను పరిశీలిస్తే.. కేఎల్‌ఎఫ్‌ ఉగ్రవాది కుల్వంత్‌ సింగ్‌ తనయుడే ఈ అవతార్‌. బాంబ్‌ ఎక్స్‌పర్ట్‌ కూడా. 2007లో యూకేకి స్టడీ వీసా మీద వెళ్లి.. 2012లో అక్కడే ఆశ్రయం పొందాడు. 2020 జనవరిలో కేఎల్‌ఎఫ్‌ మాజీ చీఫ్‌ హర్మీత్‌ సింగ్‌ హత్యానంతరం..  కేఎల్‌ఎఫ్‌లో రాంజోధ్‌ సింగ్‌ కోడ్‌ నేమ్‌తో అవతార్‌ కొనసాగాడు. 

దీప్‌ సింగ్‌ మరణాంతరం వారిస్‌ పంజాబ్‌ దే చీఫ్‌గా అమృత్‌పాల్‌ సింగ్‌ నియామకంలోనూ అవతార్‌ సింగ్‌దే కీలక పాత్ర కూడా. మెంటార్‌ రోల్‌లో అమృత్‌పాల్‌ ప్రతీ వ్యవహారాన్ని అవతార్‌ చూసుకుంటూ వచ్చాడు కూడా. ఇక 37 రోజులపాటు అమృత్‌పాల్‌ సింగ్‌ పరారీలో ఉండగా.. ఆ సమయంలో యూకే నుంచి అవతార్‌ సహాయసహకారాలు అందించాడని దర్యాప్తు బృందాలు నిర్ధారించుకున్నాయి. బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న అవతార్‌ సింగ్‌ బర్మింగ్‌హమ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు మెడికల్‌ రిపోర్టులు చెబుతున్నా.. అతనిపై విష ప్రయోగం జరిగిందనే అనుమానాల నడుమ దర్యాప్తు కొనసాగుతోంది. 

ఇదిలా ఉంటే ఏప్రిల్‌ 23వ తేదీన పంజాబ్‌ మోగాలో అమృత్‌పాల్‌ సింగ్‌ పోలీసులకు లొంగిపోగా..   అసోం దిబ్రుఘడ్‌ జైలుకు అతన్ని తరలించారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృత్‌పాల్‌, అతని ఎనిమిది మంది అనుచరులపైనా కేసులు నమోదు అయ్యాయి.

సంబంధిత వార్త: వేట ముగిసింది.. అమృత్‌పాల్‌ అరెస్ట్‌ 

Advertisement
Advertisement