ఆటోనగర్/రామవరప్పాడు: ఇంజిన్లో వచ్చిన సాంకేతిక సమస్యతో గూడవల్లి నుంచి విజయవాడ వస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన రామవరప్పాడు రింగ్ రోడ్డు సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వెనుకగా వస్తున్న వాహనదారులు మంటలు గమనించి కారు నడుపుతున్న వ్యక్తిని అప్రమత్తం చేశారు. దీంతో ఆయన కారును నిలిపివేసి సురక్షితంగా బయటకు దిగాడు. ప్రమాద విషయాన్ని వెంటనే అగ్నిమాపక విభాగానికి తెలియజేశారు. సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. కారు యజమాని దూపాటి విజయరామిరెడ్డి గూడవల్లి దగ్గర ఓ కంపెనీలో మేనేజరుగా పనిచేస్తున్నారు. విధులు ముగించుకొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఎస్ఐ జాన్బాషా చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తుల అరెస్ట్
గన్నవరం: గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను శనివారం గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. మండలంలోని కేసరపల్లి వద్ద జాతీయ రహదారిపై సీఐ పి. కనకరావు నేతృత్వంలో ఎస్ఐలు శ్రీనివాస్, రమేష్ వాహనాల తనిఖీ నిర్వహించారు. ఏలూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాల్లో తరలిస్తున్న నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని నలుగురిని అదుపులోకి తీసుకొన్నారు. వారి నుంచి రూ. 3,500 నగదు, రెండు బైక్లను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు.