మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నిరుద్యోగ యువతకు ప్రయివేటు కంపెనీల్లో ఉద్యోగాలు చూపించేందుకు మంగళవారం ఉదయం పది గంటలకు పెనమలూరు మండలం పోరంకి శ్రీనివాసనగర్లోని హ్యాపీ మైండ్స్ సెంటర్ ఆవరణలో మినీ జాబ్ మేళా జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్మేళాలో ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రయివేట్ లిమిటెడ్, జోయా లుకాస్ జ్యువెలరీలో వివిధ ఉద్యోగాలకు సంబంధించి ఆయా కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా జిల్లాకు చెందిన 18 నుంచి 26 సంవత్సరాల లోపు మధ్య వయస్సు ఉండి, ఇంటర్, ఏదైన డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు తమ బయోడేటా, విద్యార్హతకు సంబంధించి సర్టిఫికెట్ల జిరాక్స్లు, ఆధార్ కార్డ్ కాపీలతో ఈ మేళాకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 96666 15539 సెల్ నంబరులో సంప్రదించాలని కోరారు.
సంజీవని వైద్యాలయంలో కాన్పులు పూర్తి ఉచితం
కూచిపూడి(మొవ్వ): దీపావళి పండుగను పురస్కరించుకుని మొవ్వ మండలం కూచిపూడిలో సంజీవని వైద్యాలయంలో గర్భిణులకు సాధారణ, సిజేరియన్ కాన్పులను పూర్తి ఉచితంగా చేస్తామని ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు వారు సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు పేర్లు నమోదు చేసుకున్న వారితో పాటు డిసెంబర్ 31వ తేదీలోపు నమోదు చేసుకునే గర్భిణులకు సాధారణ, సిజేరియన్ కాన్పులు ఉచితంగా నిర్వహిచేందుకు హాస్పిటల్ చైర్మన్ కూచిబొట్ల ఆనంద్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని కూచిపూడి పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జొన్నలగడ్డ హనుమకుమార్, డాక్టర్ తాతా నిర్మల, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యుడు పామర్తి శివకుమార్ పాల్గొన్నారు.