టెక్కలి రూరల్: మండలంలోని అయోధ్యపురం పంచాయతీ పరిధిలోని దీపావళి గ్రామంలో ఆదివారం సా యంత్రం పిడుగు పడి 78 మేక, గొర్రె పిల్లలు మృతిచెందాయి. పశుసంవర్ధకశాఖ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. టెక్కలికి చెందిన డొక్కరి రాజు, ఆదినారాయణ, లక్ష్మణరావు, మల్లేషు, కృష్ణ, రామారావులకు చెందిన సుమారు 78 మేక, గొర్రె పిల్లలను తీసుకుని దీపావళి గ్రామంలో మంద వేశారు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు వచ్చి పిడుగు పడడంతో మూగజీవాలన్నీ ఊపిరి వదిలేశాయి. విషయం తెలుసుకున్న యజమానులు సంఘటన స్థలానికి చేరుకుని విలపించారు. సోమవారం పోస్టుమార్టం నిర్వహించి నివేదికను ఉన్నతధికారులకు అందజేస్తామని పశుసంవర్ధక శాఖ ఏడీ జి.రఘునాథ్ తెలిపారు.
శ్రీకాకుళం క్రైమ్ : శ్రీకాకుళంలోని బలగ భద్రమ్మ తల్లి ఆలయంపై ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో పిడుగు పడింది. ఆ సమయంలో ఆలయం చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ప్రా ణాపాయం తప్పింది. అర్చకులు పూజారి పొట్నూరు శ్రీను లోపల పూజ చేస్తుండగా పెద్ద శబ్ధంతో పిడుగు పడడంతో ఉలిక్కిపడ్డారు. ఈ పిడుగు ధాటికి ఆలయ గర్భగుడిలోనుంచి గోపుర సొరంగం చివరి భాగాన పెచ్చులూడి కిందకు పడ్డాయి. అర్చకుడు బయటకు వచ్చి చూస్తే గోపురం బయట అంచున వెనుక భాగాన ఉన్న కాళీమాత, లక్ష్మీదేవి విగ్రహాలు పూర్తిగా ధ్వంసమై కనిపించాయి. గోపురంపైకి వెళ్లి చూస్తే మరో రెండు విగ్రహాలు ధ్వంసమైనట్లు తెలిసింది. అమ్మవారి మూలవిరాట్టుకు మాత్రం ఏమీ కాలేదు. విగ్రహంపైన ఉండే ఛత్రం పడిపోయింది. 165 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని ఏడాదిన్నర కిందటే గ్రామస్తులు చందాలు వేసుకుని జీర్ణోద్ధరణ చేశారు. రూ.3లక్షల మేర నష్టం ఉంటుందని భావిస్తున్నారు.