మాల్‌ప్రాక్టీస్‌ను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు | Sakshi
Sakshi News home page

మాల్‌ప్రాక్టీస్‌ను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు

Published Tue, Mar 21 2023 1:48 AM

కాలిపోయిన పూరిల్లు - Sakshi

రామభద్రపురం: వచ్చే నెల 3వ తేదీ నుంచి పదోతరగతి వార్షిక పరీక్షలు జరగనున్నందున పరీక్ష కేంద్రాలను హై సెక్యూరిటీ జోన్లుగా మార్పుచేస్తున్నామని డీఈఓ లింగేశ్వరరెడ్డి తెలిపారు. డిప్యూటీ డీఈఓ తిరుపతిరాయుడితో కలిసి సోమవారం రామభద్రపురంలో విలేకర్లతో మాట్లాడారు. ఎగ్జామ్స్‌ యాక్ట్‌–25 ప్రకారం పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన, పేపర్‌ లీకేజీ, మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశ్నపత్రంపై ఏడు అంకెలతో కూడిన ప్రత్యేక కోడ్‌ ముద్రించారని, ఏదైనా కేంద్రం నుంచి ప్రశ్నపత్రం లీక్‌ అయితే అది ఎక్కడ జరిగిందో గుర్తించే విధానాన్ని విద్యాశాఖ అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఎన్నికల మాదిరిగా పరీక్షల నిర్వహణలోనూ స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రోసీజర్‌ పాటించాలని స్పష్టం చేశారు. డ్యూటీ పాస్‌ లేకుండా పరీక్ష కేంద్రంలోకి ఎవరినీ అనుమతించరాదన్నారు. విద్యార్థులకు రోల్‌ నంబర్‌ ఆధారంగా సీటింగ్‌ ఏర్పాటుతో పాటు ఓఎంఆర్‌ షీట్‌, ప్రశ్న పత్రాలను వారి సీరియల్‌ నంబర్‌ వారీగా పంపిణీ చేస్తామని చెప్పారు. ప్రతీ విద్యార్థికి 24 పేజీలతో కూడిన ఆన్సర్‌ బుక్‌లెట్‌ను ఇస్తామని, అదనంగా అవసరమైతే 12 పేజీల బుక్‌లెట్‌ను ఇస్తామన్నారు.

పూరిల్లు దగ్ధం

దత్తిరాజేరు: మండలంలోని పెదమానాపురం రెల్లి వీధిలో కుంపటి నిప్పులు తాటి కమ్మలకు అంటుకోవడంతో గ్రామానికి చెందిన ధనాల లక్షి పూరిల్లు దగ్ధమైనట్లు వీఆర్వో కూర్మారావు సోమవారం తెలిపారు. నిరుపేద అయిన లక్షి రైల్వే ట్రాక్‌ వద్ద జొన్న పొత్తులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. అగ్ని ప్రమాదం జరగంతో ఇంటిలో ఉన్న సామగ్రితో పాటు కొంత నగదు కాలి బూడిదై రూ.ముప్‌పై వేల వరకు ఆస్తినష్టం జరిగిందని ఈ విషయమై ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు వీఆర్వో తెలిపారు.

Advertisement
Advertisement