నాలుగు రోజులుగా ఉరికి వేలాడుతూ.. | Sakshi
Sakshi News home page

నాలుగు రోజులుగా ఉరికి వేలాడుతూ..

Published Sat, May 27 2023 9:10 AM

- - Sakshi

నరసన్నపేట: నాలుగు రోజులుగా ఆ ఇంటి తలుపులు మూసే ఉన్నాయి. న్యూస్‌ పేపర్లు ఎక్కడ వేసినవి అక్కడే ఉన్నాయి. ఎవరు పిలిచినా లోపల నుంచి సమాధానం రావడం లేదు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఇంటికి వెళ్లి పరిశీలించిన పోలీసులకు ఫ్యాన్‌ హుక్‌కు ఓ మహిళ మృతదేహం వేలాడుతూ కనిపించింది. నాలుగు రోజులుగా ఆ మృతదేహం అలాగే ఉన్నట్లు వారు గుర్తించారు. నరసన్నపేట శ్రీరామనగర్‌లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతురాలు బమ్మిడి శాంతకుమారి(39) అని, ఆమెది శ్రీకాకుళంలోని ప్రశాంతి నగర్‌ అని పోలీసులు నిర్ధారించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

స్థానిక శ్రీరామనగర్‌లో బమ్మిడి జయకుమార్‌, భార్య శాంతకుమారి నివాసం ఉంటున్నారు. నా లుగు రోజులుగా ఆ ఇంటికి ఎవరూ రాకపోవడం, ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారి ఫిర్యా దు మేరకు ఎస్‌ఐ వై.సింహాచలం శుక్రవారం ఉద యం ఇంటిని పరిశీలించారు. తలుపులకు లోపల నుంచి గడియ పెట్టి ఉండడంతో తీయడం సాధ్యం కాలేదు. దీంతో ఆ కుటుంబం వివరాలు సేకరించారు. స్థానిక వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఆఫీస్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బమ్మిడి జయకుమార్‌ తన భార్య శాంత కుమారితో అక్కడ నివశిస్తున్నట్లు తెలుసుకున్నారు.

జయకుమార్‌ ఆచూకీ తెలుసుకొని ఆయనను ఇంటికి రప్పించారు. అలాగే శాంతకుమారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వా రు వచ్చిన తర్వాత గడియ విరగ్గొట్టి లోపలకు వెళ్లి చూస్తే వంట గదిలో ఫ్యాన్‌ హుక్‌కు ఉరి వేసుకుని శాంతకుమారి కనిపించింది. సంఘటన జరిగి నాలు గు రోజులు కావడంతో మృతదేహం నుంచి దుర్వాసన అధికంగా వచ్చింది. ఆమె మృతదేహాన్ని చూసి న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అప్పటికే సిద్ధంగా ఉన్న క్లూస్‌ టీమ్‌ సభ్యులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. శాంత కుమారి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

ఈ నెల 23వ తేదీ వేకువజామున ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. అంతకుముందు రోజు భార్యతో గొడవపడిన జయకుమార్‌ తన స్వగ్రామం నందిగాం మండలం శ్రీపురం వెళ్లిపోయి అక్కడే ఉన్నారు. దీంతో ఇంటిలో ఎవరూ లేని సమయం చూసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని టెక్కలి డీఎస్‌పీ బాలచంద్రారెడ్డి, తహసీల్దార్‌ ఎ.సింహాచలంలు పరిశీలించారు. మృతురాలి తండ్రి చిగులపల్లి లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట సీఐ డి.రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

‘వేధింపులు తాళలేకే..’
‘నా కుమార్తె శాంతకుమారి అల్లుడు, ఆయన కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక ఈ అఘాయిత్యానికి పాల్పడింది’ అని తల్లిదండ్రులు చిగులపల్లి లక్ష్మణరావు, కనకరత్నం సోదరి ధనలక్ష్మిలు ఆరోపించారు. వివాహమైనప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని తెలిపారు. అవి భరించలేకే తమ కుమార్తె చనిపోయిందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 2018లో వివాహమైందని, సంతానం లేదని అన్నారు. భర్త జయకుమార్‌ మాట్లాడుతూ ఆమె తనను వేధించేదని, పలుమార్లు కొట్టిందని, ఆ బాధలకు భయపడి 22న సొంతూరు వెళ్లిపోయానని, ఆ తర్వాత ఈ అఘాయిత్యానికి పాల్పడిందని అన్నారు.

Advertisement
Advertisement