Sakshi News home page

యువకుడి మృతదేహం లభ్యం

Published Thu, Nov 9 2023 2:24 AM

సునీల్‌ మృతదేహం - Sakshi

మల్కన్‌గిరి: జిల్లాలోని పోడియ సమితి కుమార్‌వీధికి చెందిన సునీల్‌ పోడియామి(21) మృతదేహం ఎట్టకేలకు బుధవారం లభ్యమైంది. వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్‌ 29వ తేదీన సునీల్‌ తన స్నేహితులతో కలిసి మార్నింగ్‌ వాక్‌కు వెళ్లాడు. అయితే మధ్యాహ్నం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్నేహితులను సునీల్‌ ఎక్కడని అడిగారు. శబరీ నదిలో స్నానం చేసి వస్తానని చెప్పాడని వారు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో నది వద్దకు వెళ్లగా గట్టుపై సునీల్‌ దుస్తులు, సెల్‌ఫోన్‌ ఉన్నాయి. దీంతో నదిలో గల్లంతయ్యాడని కుటుంబ సభ్యులు పోడియ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అగ్నిమాపక సిబ్బంది నదిలో రెండు రోజుల పాటు గాలించినా ఎటువంటి ఆచూకీ లభ్యమవ్వలేదు. దీంతో మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. కాగా బుధవారం ఉదయం నదిలోని రాళ్ల మధ్యలో సునీల్‌ మృతదేహం తేలుతూ కనిపించింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా, పోడియ ఐఐసీ నిరంజన్‌ పైకారాయి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది నదిలో దిగి మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే తమ బిడ్డను ఎవరో హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోడియ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే హత్య జరిగిందా, ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడా అనేది తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement