● పోలీసుస్టేషన్లో లొంగిపోయిన నిందితుడు
రాయగడ: జిల్లాలోని హటోమునిగుడలో మహిళను ఒక వ్యక్తి గొడ్డలితో నరికి హత్య చేసి, అనంతరం పోలీసుస్టేషన్లో లొంగిపోయిన ఘటన గురువారం చోటుచేసుకుంది. హటోమునిగుడ సమీపంలోని రామకృష్ణ మిషన్ స్కూల్లో గార్డెన్గా పనిచేస్తున్న నందిని నాయక్ (32) ఈ దారుణ హత్యకు గురయ్యింది. హత్య చేసిన వ్యక్తి అయిరా చంద్ర (36)గా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నందిని స్వగ్రామం గౌడోగుడ. స్కూల్లో పనులు ముగించుకుని ప్రతిరోజూ హటోమునిగుడలోని
తన స్నేహితురాలైన అయిరా చంద్ర భార్య ఇంట్లో తలదాచుకునేది. అయితే ప్రతిరోజూ ఒక పరాయి మహిళ తన ఇంట్లో పడుకోవడమేంటని తన భార్యను చంద్ర వారిస్తూ ఉండేవాడు. ఇకపై ఇంకెప్పుడు తన ఇంటికి రావొద్దని సదరు మహిళకు చెప్పాలని తన భార్యను హెచ్చరించాడు. అయితే ఇదేమీ పట్టించుకోని చంద్ర భార్య తన స్నేహితురాలికి చెప్పలేకపోయింది. దీంతొ కోపగించుకున్న చంద్ర గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో నిద్రిస్తున్న నందినిని గొడ్డలితో మూడుసార్లు నరికి హత్య చేశాడు. అనంతరం మునిగుడ పోలీసుస్టేషన్లో లొంగిపొయాడు. తన ఇంట్లో ఒక మహిళను హత్య చేశానని, తనను అరెస్టు చేయాలని పోలీసులకు చెప్పాడు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్డీపీవో సంతోషిణి ఒరం, పోలీసు సిబ్బంది మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.