యువ జంట ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

యువ జంట ఆత్మహత్య

Published Sat, Nov 18 2023 12:36 AM

- - Sakshi

కాశీబుగ్గ: ఇద్దరిదీ ఈ ప్రాంతం కాదు. ఎందుకు వచ్చారో, ఏం జరిగిందో తెలీదు. పలాస రైల్వే స్టేషన్‌లో దిగారు. పాప్‌కార్న్‌ కొన్నారు. స్టేషన్‌లోనే నవ్వుతూ, తుళ్లుతూ తిరిగారు. కాసేపు అక్కడున్న బెంచీలపై కూర్చుని మాట్లాడుకున్నారు. ఇంతలోనే ఏం జరిగిందో గానీ అమ్మాయి గూడ్స్‌ రైలు కింద పడి చనిపోయింది. దాన్ని ఆపేందుకు ప్రయత్నించిన అబ్బాయి విఫలమై రైలు పట్టాలపై తలపెట్టి ప్రాణాలు అర్పించాడు. పలాస రైల్వేస్టేషన్‌లో శుక్రవారం రాత్రి జరిగిన సంచలనంగా మారింది. పలాస జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ బెంగాల్‌ డార్జిలింగ్‌ ప్రాంతానికి చెందిన రంజన్‌ రాయ్‌ అనే యువతి, తుషారింగ్‌ తాషీ షెర్పా అనే యువకుడు శుక్రవారం పలాస స్టేషన్‌లో దిగారు. నవ్వుతూ మాట్లాడుకుంటూనే మూడో నంబర్‌ ప్లాట్‌ఫారంపై నుంచి పట్టాలపైకి దిగారు. ముందు రంజన్‌ రాయ్‌ గూడ్స్‌ రైలు కింద తలపెట్టి చనిపోయింది. ఆమెను ఆపలేకపోవడంతో యువకుడు కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే సిబ్బంది వారి వద్ద ఉన్న ఆధార్‌ కార్డు ఆధారంగా వివరాలు తెలుసుకున్నారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేశామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని జీఆర్పీ ఎస్‌ఐ షరీఫ్‌ తెలిపారు. మృతదేహాలను పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో మార్చురీ విభాగానికి తరలించారు.

Advertisement
Advertisement