అత్త, మరదలిపై అల్లుడి దాడి | Sakshi
Sakshi News home page

అత్త, మరదలిపై అల్లుడి దాడి

Published Sun, Mar 10 2024 7:45 AM

గాయాలతో అత్త పార్వతి జొడియా - Sakshi

రాయగడ: చెడు తిరుగులు తిరుగుతున్నావని వారించిన అత్త, మరదలిపై ఇనుప రాడ్డుతో దాడిచేసి తీవ్రగాయాలకు గురిచేసిన అల్లుడి ఉదంతం వెలుగుచూసింది. సదరు పోలీసుస్టేషన్‌ పరిధి చెక్కగుడ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిందితుడు ఢిల్లేశ్వర్‌ బలస(32)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడిలో గాయపడిన అత్త పార్వతి జొడియా (48), మరదలు బాసంతి జొడియా (24)లను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం కొరాపుట్‌ తరలించారు.

పోలీసుల వివరాల మేరకు...
చెక్కగుడలో నివాసముంటున్న బాసంతి జొడియాకు ఇద్దరు కూతుళ్లు. వీరిలో పెద్ద కూతురు భారతి (28)ని అదే ప్రాంతానికి చెందిన ఢిల్లేశ్వర్‌కు ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం జరిపించారు. ఇద్దరు అన్యోన్యంగా చెక్కాగుడలోనే వేరే ఇంటిలో నివసిస్తుండేవారు. అయితే కొన్ని నెలలుగా ఢిల్లీశ్వర్‌ ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి తన భార్య భారతిని వేదిస్తున్నాడు. దీంతో విసుగెత్తిన ఆమె విషయాన్ని తన తల్లి పార్వతికి తెలియజేసింది. ఈ క్రమంలో గ్రామంలోని పెద్దలకు ఈ విషయం తెలియజేయగా భార్యభర్తలు వేర్వేరుగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో తల్లితో భారతి ఉండేది.

శుక్రవారం ఉదయం తన చెల్లి బాసంతితో కలిసి భారతి విడాకుల కోసం ఒక న్యాయవాదిని కలిసింది. అనంతరం ఇంటికి తిరిగి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లేశ్వర్‌ రాత్రి 10 గంటల సమయంలో తప్పతాగి ఒక రాడ్డు సాయంతో మరదలు బాసంతిపై దాడి చేశాడు. అదేవిధంగా అడ్డుపడిన అత్త పార్వతీపై కూడా దాడి చేయడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. దీంతో భారతి కేకలు వేయగా స్థానికులు వచ్చి గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. భారతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గాయాలతో బాసంతి జొడియా
1/1

గాయాలతో బాసంతి జొడియా

Advertisement
Advertisement