అచ్చంపేట: ఏ ప్రభుత్వంలోనూ లేనివిధంగా వైఎస్సార్ సీపీ హయాంలో అన్ని సామాజిక వర్గాలకూ సమన్యాయం చేసినట్టు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చెప్పారు. దీనిని ప్రజలకు వివరించేందుకు సామాజిక సాధికార బస్సు యాత్రను నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈనెల 10న అమరావతిలో జరిగే సామాజిక సాధికార బస్సు యాత్రను జయప్రదం చేయాలని కోరారు. స్థానిక ట్రావెలర్స్ బంగ్లా వద్ద బుధవారం సాయంత్రం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్, లావు శ్రీకృష్ణదేవరాయలు, మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, మేరుగ నాగార్జున, వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్, కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటులు ఆలి, ఎమ్మెల్సీలు చంద్రగిరి ఏసురత్నం, కుంభా రవి తదితరులు యాత్రలో పాల్గొంటారని చెప్పారు. 10న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు చిన్నతరహా వ్యాపారులతో విజయసాయిరెడ్డి సమావేశమై సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలపై చర్చిస్తారని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చెప్పారు. రెండు గంటలకు జేబీ గార్డెన్స్ నుంచి భారీ ర్యాలీ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇది రథం సెంటర్ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. అచ్చంపేట మండలం నుంచి ఐదు వేల మందికి తగ్గకుండా కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ అచ్చంపేట మండల కన్వీనర్ చిల్కా చంద్రయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ సీహెచ్ ఎస్సార్కే సాయిరెడ్డి, ఎంపీపీ భూక్యా రజని కృష్ణానాయక్, సర్పంచ్ కంబాల వీరబాబు, సొసైటీ అధ్యక్షులు రామిశెట్టి రంగయ్య, వైస్ ఎంపీపీ గంగసానిబాబు, సొసైటీ మాజీ చైర్మన్ తుమ్మా చిన్నపరెడ్డి, మాజీ సర్పంచ్ టీవీఎస్ మల్లికార్జునరావు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నంబూరు శంకరరావు