నగరంపాలెం(గుంటూరు వెస్ట్): గుంటూరు జిల్లా వాసులు పోగొట్టుకున్న మొబైల్ఫోన్లు ఎక్కువగా ఉత్తరాది/పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నా యని, అయినా ఆ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి బాధితులకు వాటిని తిరిగి అప్పగిస్తున్నామని ఏఎస్పీ (పరిపాలన), టీఏడబ్ల్యూ నోడల్ అధికారిణి కె.సుప్రజ చెప్పారు. సుమారు రూ.30 లక్షలు ఖరీదు చేసే 110 బ్రాండెడ్ కంపెనీల మొబైల్ ఫోన్లను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఫిర్యాదిదారులకు గురువారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో ఏఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల నేపాల్ దేశం నుంచి కూడా ఓ మొబైల్ఫోన్ను తెప్పించామని చెప్పారు. జిల్లా పోలీస్ వాట్సాప్ నంబర్ 86888 31574కు బాధితుల నుంచి ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని, ఫోన్లను వేగంగా రికవరీ చేసి ఇస్తున్నామని వెల్లడించారు. దీనికోసం టీఏడబ్ల్యూ (టెక్నికల్ అనాలిసిస్ వింగ్) సమర్థంగా పనిచేస్తోందని వివరించారు. ఎఫ్ఐఆర్ లేకుండానే మొబైల్ ఫోన్లను గుర్తించి, బాధితులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. సీఈఐఆర్ సిటిజన్ పోర్టల్ కూడా బాధితులకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. మొబైల్ఫోన్ పోయిన వెంటనే పోర్టల్లో ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న సెల్ఫోన్లల్లో నిక్షిప్తమైన సమాచారం దుర్వినియోగం కాదని, అలాగే ఫోన్ బ్లాక్ అవుతుందని పేర్కొన్నారు. తద్వారా ఫోన్లను వెంటనే గుర్తించి స్వాధీనం చేసుకోవచ్చునని వెల్లడించారు. నెలక్రితం పోగొట్టుకున్న మొబైల్ తిరిగి అప్పగించడంపై 52వ డివిజన్ కార్పొరేటర్ శ్రీవల్లి సోదరుడు గోపి ఆనందం వ్యక్తం చేశారు. బాధితులకు మొబైల్ఫోన్లను అప్పగించడంపై టీఏడబ్ల్యూ నోడల్ అధికారిణి, సిబ్బందిని గుంటూరు రేంజ్ ఐజీ, జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ జి.పాలరాజు అభినందించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ బాలసుబ్రమణ్యం, ఎస్ఐలు శ్రీనాథ్ (ఐటీ కోర్), రమాదేవి, ఏఎస్ఐ రాందాస్రెడ్డి, సిబ్బంది కరిముల్లా, రమేష్ పాల్గొన్నారు.
బాధితులకు అప్పగింత
ఫోన్ పోతే 86888 31574కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయండి
గుంటూరు ఏఎస్పీ(పరిపాలన) సుప్రజ