అమరావతి: ఓటరు నమోదు ప్రక్రియలో, మార్పులు, చేర్పులు చేయడంలో బీఎల్ఓలు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎటువంటి వివాదాలు తావియ్యరాదని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు.
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం బూత్స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎల్ఓలందరూ ఇంటింటి సర్వే చేసి తప్పులు లేని ఓటరు జాబితా తయారీకి సహకరించాలన్నారు. బీఎల్ఓలు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఎలాంటి తప్పు జరగకుండా చూడాలన్నారు. ఇంటి నెంబర్లు, పేర్లు, చిరునామాలో తప్పులు ఉంటేవాటిని సరిచేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఒకే ఇంట్లో 10కి మించి ఓట్లు ఉంటే క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో ఉండే బూత్స్థాయి అధికారి ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలన్నారు. ఇదేవిధంగా ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి ఓట్లను తొలగించటం, డబుల్ఎంట్రీలను కూడా పరిశీలించి తొలగించాలన్నారు. నియోజకవర్గ ఈఆర్ఓ నాగజ్యోతి, తహసీల్దార్ విజయశ్రీలతో పాటుగా మండలంలోని అన్ని గ్రామాల బూత్లెవల్ అధికారులు పాల్గొన్నారు.