నరసరావుపేట: పేద ప్రజల ఆహార భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ బియ్యం, ఇతర నిత్యావసరాలు ఆదివారం నాటికి జిల్లాలో 28.49శాతం పంపిణీ చేసినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎస్.పద్మశ్రీ వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 1290 రేషన్షాపులు ఉండగా 402 ఎండీయూ వాహనాల ద్వారా డీలర్లు లబ్ధిదారుల ఇళ్లవద్దకే వెళ్లి పంపిణీ చేస్తున్నారన్నారు. మొత్తం 6,48,348 కార్డుదారుల్లో రేషన్ బియ్యం 1,84,738మందికి, ఆటా 25,773మందికి, కందిపప్పు 49,219మందికి, పంచదార 1,55,678మందికి పంపిణీ చేశామన్నారు. ఇప్పటివరకు జిల్లాలోని 28 మండలాల్లో అత్యధికంగా క్రోసూరు మండలంలో 38.80శాతం మందికి పంపిణీ చేయగా, అత్యల్పంగా రెంటచింతలలో 18.35శాతం మందికి పంపిణీ చేయటం జరిగిందన్నారు. ఈనెల 17వ తేదీ వరకు రేషన్ పంపిణీ జరుగుతుందన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.శ్యాంప్రసాదు ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ ప్రదేశాల్లో రేషన్ పంపిణీ తనిఖీ చేస్తున్నామని ఆమె తెలిపారు.
11న బాడీ బిల్డింగ్ పోటీలు
పెనమలూరు: ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీబిల్డింగ్ పోటీలు ఈ నెల 11వ తేదీన నిర్వహిస్తున్నామని బాడీ బిల్డింగ్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఈదా రాజేష్, అధ్యక్షుడు బి.మనోహర్, కార్యదర్శి తాళ్లూరి అశోక్ తెలిపారు. కానూరులో ఆదివారం వివరాలు తెలుపుతూ ఈ నెల 11వ తేదీన 11వ మిస్టర్ ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీబిల్డింగ్ పోటీలు కానూరు అశోక్ జిమ్ సహకారంతో గ్లోబల్ కిట్స్ పాఠశాలలో నిర్వహిస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 150 మంది క్రీడాకారులు పాల్గొంటారన్నారు. విజేతలకు నగదు బహుమతితో పాటు, సర్టిఫికెట్లు, పతకాలు అందజేస్తామన్నారు. మరిన్ని వివరాలకు 8686771358, 9985182645లో సంప్రదించాలన్నారు.
నాలుగురోజుల వ్యవధిలో 28.49శాతం ప్రజలకు అందజేత ఈనెల 17వరకు పంపిణీ