విజయనగరం టౌన్: వేలాది మంది భక్తులతో బాబామెట్ట పునీతమైంది. హజరత్ ఖాదర్వలీ బాబా పుణ్యక్షేత్రాన్ని దర్శించేందుకు బారులు తీరుతున్నారు. శుక్రవారం దర్బార్లో నిర్వహించిన గంధ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దర్గాలో పవిత్ర ఖురాన్ పఠనంతో ఉత్సవం ప్రారంభమైంది. దర్బార్ వారసులు సజ్జాద్ నషీన్ మహమ్మద్ ఖాజా మొహియుద్దీన్ షా ఖాదరీ బాబా దర్గా, దర్బార్ ముతావలి డాక్టర్ ఖలీలుల్లా షరీప్, ఎం.డి జాఫర్ షరీఫ్ ఉర్సు మహోత్సవాన్ని ప్రారంభిస్తూ, దర్బార్లో ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. అనంతరం ఫకీర్ మేళాతో ఊరేగింపుగా, మేళతాళాల నడుమ బాబా వారి చాదర్, అత్తరు, పూలమాలలతో దర్గాకు కోలాహలం మధ్య వచ్చి దర్బార్లోని ఆనాటి బాబా చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన రథంపై నిలిపారు. భక్తుల కోలాహలం మధ్యన బాబాకు చాదర్ సమర్పించి, జెండా మహోత్సం నిర్వహించారు. పురవీధుల్లో రథంపై ఆశీనులైన బాబా భక్తులను ఆశీర్వదించారు. కోలాటం, తప్పెటగుళ్లు, పులివేషాలు, బ్యాండ్ పార్టీలతో నగరవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. సుమారు 60వేల మంది భక్తులు లంగర్ ఖానాలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
మతసామరస్యానికి ప్రతీక
మతసామరస్యానికి ప్రతీక మన విజయనగరమని నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం బాబామెట్టలోని రెడ్డిబాబా ఆధ్వర్యంలో సర్వేయర్ కుమార్ నివాసం నుంచి చందన్ ఊరేగింపును ఆమె ప్రారంభించారు. బాబా చిత్రపటానికి పూలమాలలేసి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వమానవాళికి అద్భుతమైన సందేశాన్ని హజరత్ ఖాదర్ వలీ బాబా అందించారన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ శ్రావణి