చీపురుపల్లి మూడు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి చంద్రబాబు వ్యాఖ్యలపై నిరసన తెలుపుతున్న లబ్ధిదారులు
కురుపాం: రావాడ కూడలిలో చంద్రబాబు దిష్టబొమ్మను దహనం చేస్తున్న ఇళ్ల లబ్ధిదారులు
పార్వతీపురంటౌన్ : చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తున్న ఎమ్మెల్యే, గృహ లబ్ధిదారులు
పార్వతీపురంటౌన్: దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ కొత్త ఊళ్లను నిర్మిస్తుంటే... వాటిని సమాధులతో పోల్చుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పేదలు మండిపడ్డారు. అహంకార పూరిత వ్యాఖ్యలకు తగిన జవాబు ఇస్తామని ఇళ్ల లబ్ధిదారులు హెచ్చరించారు. టీడీపీని సమాధి చేస్తామని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే అలజంగి జోగారావు, పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పార్వతీపురం మండలంలోని నర్సిపురం జగనన్న లేఅవుట్ వద్ద లబ్ధిదారులు మానవహారంగా ఏర్పడి ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో రాష్ట్రంలో 30లక్షలపై చిలుకు లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసిందన్నారు. ప్రత్యేకంగా 17 వేల వైఎస్సార్ జగనన్న కాలనీల్లో కొత్త ఇళ్ల నిర్మాణాలతో ఊళ్లను తలపిస్తున్నాయని తెలిపారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుల ద్వారా అడ్డుకోవాలని చూసిన చంద్రబాబునాయుడుకు ఇటీవలే కోర్టు తీర్పు చెంపపెట్టులా మారిందన్నారు. తమకు ఇచ్చిన ఇళ్లను సమాధులతో పోల్చిన చంద్రబాబును 2024 ఎన్నికల్లో తామంతా కలిసి సమాధి చేస్తామని హెచ్చరిస్తూ.. ఖబడ్డార్ చంద్రబాబు అంటూ లబ్ధిదారులు ముక్తకంఠంతో హెచ్చరించారు. కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్పర్సన్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మూడు మండలాల పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, గృహ లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కురుపాంలో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
కురుపాం: పేదల ఇళ్లపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కురుపాం నియోజకవర్గంలోని రావాడ కూడలిలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబునాయుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీలు ఉరిటి రామారావు, దీనమయ, శెట్టి పద్మావతి, శెట్టి శ్యామల, జెడ్పీవైస్ చైర్మన్ మరిశర్ల బాపూజీనాయుడు, జెడ్పీటీసీలు మూడడ్ల శశికల, గొర్లి సుజాతలు మాట్లాడుతూ రాజకీయాల్లో సీనియర్ నేతగా తనకు తానే గొప్పలు చెప్పుకొనే చంద్రబాబుకు బడుగు బలహీన వర్గాలంటే చిన్నచూపన్నారు. అహంకార పూరిత వ్యాఖ్యలను మానుకోవాలని, లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. చంద్రబాబు డౌన్డౌన్ అంటూ నినదించి దిష్టిబొమ్మను దహనంచేశారు. వైఎస్సార్సీపీ నాయకులు శెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అయ్యరక, రజక కార్పొరేషన్ల డైరెక్టర్లు గవర విజయ్, గోరిశెట్టి గిరిబాబు, డీసీసీబీ డైరెక్టర్ లోలుగు నారాయణరావు, జియ్యమ్మవలస వైస్ ఎంపీపీ సంపత్కుమార్, ఏపీఎంఎస్ ఎంఈ డైరక్టర్ మూడడ్ల గౌరీశంకరరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అంధవరపు కోటేశ్వరరావు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చీపురుపల్లిలో నిరసన
చీపురుపల్లి: పేదలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలు, నిర్మాణాలపై చంద్రబాబునాయుడు చేసిన అప్రజాస్వామిక వ్యాఖ్యలకు నిరసనగా చీపురుపల్లి పట్టణంలో లబ్ధిదారులు, వైఎస్సార్సీపీ శ్రేణులు శనివారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. లావేరురోడ్, మెయిన్రోడ్ మీదుగా నిరసన ర్యాలీ నిర్వహించారు. మూడు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి చంద్రబాబు డౌన్డౌన్, తక్షణమే అరెస్ట్ చేయాలంటూ నినదించారు. పేదలకు అన్యాయం జరిగేలా, హేలన చేస్తూ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబునాయుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ చీపురుపల్లి మండల నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, బెల్లాన వంశీకృష్ణ, ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.